ఆఖరి పోరాటం : ... ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా.. ఆందోళనలో భారత్

బుధవారం, 13 మార్చి 2019 (09:45 IST)
స్వదేశంలో పర్యాటక ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మ్యాచ్ ఫలితాన్ని శాసించే చివరి వన్డే బుధవారం జరుగనుంది. ఢిల్లీ వేదికగా జరిగే మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లూ కొదమసింహాల్లా పోరాడనున్నాయి. ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్డేల్లో ఇరు జట్లూ రెండేసి మ్యాచ్‌లలో విజయం సాధించి సమఉజ్జీలుగా ఉన్నాయి. దీంతో చివరి వన్డేలో మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఇరు జట్లూ ఉన్నాయి. 
 
అంతేకాకుండా, భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్‌ ఇదే చివరిదికానుంది. మారిన ఐసీసీ నిబంధనల ప్రకారం 2020 మే నుంచి ఏ రెండు జట్ల మధ్య కూడా మూడు కంటే ఎక్కువ మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరగదు. మరోవైపు, ఆసీస్‌తో స్వదేశంలో వరుసగా మూడు వన్డే సిరీస్‌లను నెగ్గిన టీమిండియా అదే రికార్డును కొనసాగిస్తూ మరో సిరీస్‌ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంటే... గత మ్యాచ్‌లో విజయం తర్వాత ఆసీస్‌లో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఫిరోజ్‌ షా కోట్లా వేదికగా నేడు జరిగే ఐదో వన్డేలో తలపడేందుకు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. 
 
కాగా, తొలి మూడు వన్డేల తర్వాత గత మ్యాచ్‌లో భారత్‌ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. కీపింగ్‌లో రిషబ్ పంత్ కాస్త తడబడినా... అతని స్థానానికి ఎలాంటి ముప్పులేదని చెప్పొచ్చు. ఇకపోతే, భువనేశ్వర్, చహల్‌ కూడా భారీగా పరుగులిచ్చినా వారిపై మేనేజ్‌మెంట్‌కు నమ్మకముంది. అయితే నాలుగో స్థానంలో ఆడిన లోకేశ్‌ రాహుల్‌ విషయంలో మాత్రం మార్పు చేసే అవకాశం ఉంది. అంబటి రాయుడుకు బదులుగా వచ్చిన రాహుల్‌ పెద్దగా రాణించలేదు. ఇన్నింగ్స్‌ ఆసాంతం ఆత్మవిశ్వాసం లోపించినట్లు తడబడుతూనే ఆడాడు. 
 
ఇక నాగపూర్‌ వన్డే మినహా మిగిలిన మూడు మ్యాచుల్లో 60, 53, 63 పరుగుల చొప్పున ఇచ్చిన బుమ్రా ఆట కూడా పదునెక్కాల్సి ఉంది. 358 పరుగులు చేసిన జట్టు బ్యాటింగ్‌ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఓపెనర్లతో పాటు కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకపోగా... ఆ తర్వాత వచ్చే పంత్, కేదార్‌ జాదవ్‌ కూడా అదనపు పరుగులు జోడించాల్సి ఉంది. చాలాకాలం తర్వాత జంటగా విఫలమైన కుల్దీప్‌ యాదవ్, యజువేంద్ర చహల్‌ చెలరేగితే మ్యాచ్‌ మన వైపు మొగ్గుతుంది.  
 
అదేసమయంలో కంగారులు మంచి జోరుమీద వున్నారు. మంగళవారం జరిగిన ప్రాక్టీస్‌ను బట్టి చూస్తే స్టొయినిస్‌ గాయం నుంచి కోలుకున్నట్లే కనిపించాడు. అయితే అతని స్థానంలో వచ్చి నాలుగో వన్డేలో అద్భుత ఆటతో గెలిపించిన టర్నర్‌ను పక్కన పెట్టే పరిస్థితి లేదు. అతను మళ్లీ చెలరేగగలడా చూడాలి. కానీ స్టొయినిస్‌ లేకపోవడంతో గత మ్యాచ్‌లో ఆసీస్‌ ఐదో బౌలర్‌ కొరతను ఎదుర్కొని భారీగా పరుగులు సమర్పించుకుంది. చివరకు ఫించ్‌ కూడా బౌలింగ్‌ వేయాల్సి వచ్చింది. ఈ సమస్యను జట్టు ఎలా అధిగమిస్తుందనేది కీలకం. చివరి మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లతో ఆడిన కంగారూలు పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని రెండో స్పిన్నర్‌ను ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.
 
తుది జట్లు (అంచనా)  
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రాహుల్, పంత్, జాదవ్, విజయ్‌ శంకర్, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. 
ఆస్ట్రేలియా: ఫించ్, ఖాజా, మార్ష్, హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్, టర్నర్, కారీ, రిచర్డ్సన్, కమిన్స్, జంపా, బెహ్రన్‌డార్ఫ్‌/లయన్‌. 
 
పిచ్, వాతావరణం  
ఫిరోజ్‌ షా కోట్లా వికెట్‌ నెమ్మదిగానే ఉంటుంది. ఇక్కడ జరిగిన గత రెండు వన్డేల్లో తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. టాస్‌ కీలకం కానుంది. మ్యాచ్‌ రోజు ఢిల్లీలో మేఘావృతంగా ఉండబోతున్నా వర్షంతో ఆటకు అంతరాయం కలిగే అవకాశం తక్కువగా ఉన్నాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు