ట్వంటీ20 సిరీస్ : రోహిత్ వీరకొట్టుడు.. ఇంగ్లీష్ బౌలర్లు బెంబేలు

సోమవారం, 9 జులై 2018 (11:28 IST)
బ్రిస్టల్ వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు విజయభేరీ మోగించింది. భారత ఆటగాడు రోహిత్ శర్మ వీరకొట్టుడుకు ఇంగ్లీష్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. సిరీస్ గెలవాలంటే తప్పక నెగ్గాల్సిన చివరి మ్యాచ్‌లో కోహ్లీసేన సత్తా చాటింది. 199 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ నిర్దేశించగా.. రోహిత్‌శర్మ 56 బంతుల్లో, 11 ఫోర్లు, 5 సిక్సర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్ శతకంతో రెచ్చిపోవడంతో మరో 8 బంతులుండగానే సునాయాసంగా 7 వికెట్ల విజయాన్ని అందుకుంది.
 
భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌కు తోడుగా కెప్టెన్ కోహ్లీ 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 రన్స్ చేసి రాణించాడు. ఫలితంగా 7 వికెట్లతేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించి 2-1 తేడాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. చివరిమ్యాచ్‌తోపాటు సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన రోహిత్‌శర్మ మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్‌తోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. సుదీర్ఘమైన ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీ20 సిరీస్ విజయం వశంకావడంతో టీమ్ ఇండియా ఆత్మవిశ్వాసం పెరగనుంది.
 
అంతుకుముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు... ఓపెనర్ జాసన్ రాయ్ (67), జోస్ బట్లర్ (34) పరుగులతో రాణించాడు. 8 ఓవర్లలోనే 94 పరుగులకు స్కోరు చేరగా వీరిద్దరి జోడీ ప్రమాదకరంగా మారింది. ఈ దశలో సిద్ధార్థ్ కౌల్ బట్లర్‌ను వెనక్కిపంపగా.. 103 పరుగుల వద్ద దీపక్ చహార్.. రాయ్‌ను పెవిలియన్‌కు పంపడంతో ఇంగ్లండ్ పరుగుల జోరుకు కళ్లెం పడింది. 
 
అనంతరం బెన్‌స్టోక్స్(14), బెయిర్‌స్టో(25)ను పాండ్యా ఔట్ చేయడంతో ఇంగ్లండ్ జట్టు 200 పరుగుల మార్కు అందుకోలేక పోయింది. చివరలో ఆదిల్ రషీద్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీస్కోరు సాధించింది. భారత బౌలర్లలో పాండ్యా 4 వికెట్లు పడగొట్టగా, కౌల్ 2, దీపక్ చహార్, ఉమేశ్‌కు తలో వికెట్ దక్కింది.
 
ఇరు జట్ల సంక్షిప్త స్కోర్లు 
ఇంగ్లండ్ : 20 ఓవర్లలో 198/9
భారత్ : 18.4 ఓవర్లలో 201/3
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ : రోహిత్ శర్మ 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు