స్వదేశంలో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరుగనున్న టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన టీమిండియా జట్టులో తనకు చోటు కల్పించకపోవడంపై భారత క్రికెటర్ గౌతం గంభీర్ స్పందించారు. ఇదే అంశంపై గంభీర్ ట్వీట్ చేస్తూ 'నిరాశ చెందినా పోరాటం ఆపను, నన్ను లక్ష్యం చేసుకుని పక్కన పెట్టినా భయపడేంత పిరికివాడిని కాదు, జట్టులో చోటు లభించకపోయినంత మాత్రాన నేను ఓడినట్టు కాదు, నా సహచరుడు గెలిచినట్టు కాదు... నేను పోరాడుతాను, పోరాడుతాను' అంటూ ట్వీట్ చేశాడు.
మరోవైపు... సాధారణంగా జట్టును ఎంపిక చేసినప్పుడు సెలెక్టర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుంటాయి. అయితే చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ తాము ఎంపిక చేసిన ఆటగాళ్ల జాబితా కెప్టెన్ కోహ్లీ, కోచ్ కుంబ్లే చేతిలో పెట్టామని, జట్టును ఎంచుకునే అంతిమ నిర్ణయం వారికే కల్పించామని ప్రకటించాడు.