సరోగసీ స్కామ్ నిందితురాలు డాక్టర్ నమ్రతపై అనేక కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్లలో నిందితురాలు డాక్టర్ నమ్రత వైద్య నిపుణులను లాభదాయకమైన జీతాలు, కమిషన్లతో ఆకర్షించడం ద్వారా తన చట్టవిరుద్ధ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. ఇలాంటి కేసుల నుంచి తప్పించుకునేందుకు క్లినిక్లను ఏర్పాటు చేసిందని తేలింది.
సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడిన సృష్టి ఫర్టిలిటీ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత.. ఇలా ఐదుగురి జీవితాలతో చెలగాటమాడింది. సరోగసీ ద్వారా బిడ్డను అందజేస్తామని రాజస్థాన్కు చెందిన దంపతులకు హామీ ఇచ్చిన నమ్రత.. అసోంకు చెందిన దంపతులు మహ్మద్ ఆలీ ఆదిక్, నస్రీమా బేగంకు పుట్టిన మగబిడ్డను వారి నుంచి రూ. 90 వేలకు కొని.. ఆ బిడ్డ సరోగసీ ద్వారా జన్మించిన బిడ్డగా నమ్మించి పిల్లలు లేని దంపతులకు అంటగట్టింది.
ప్రతిగా ఆ దంపతుల నుంచి రూ.35 లక్షలు వసూలు చేసింది. అయితే తమ బిడ్డే అని నిరూపించుకోవడానికి డీఎన్ఏ పరీక్షల తాలుకు ధ్రువపత్రాలను నమ్రత ఇవ్వకపోవడంతో అనుమానించిన ఆ దంపతులు డీఎన్ఏ పరీక్షలు చేయించగా ఆ శిశువు తమ బిడ్డ కాదని తేలిపోయింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో సృష్టి ఫర్టిలిటీలో జరుగుతున్న మోసాల గుట్టు బట్టబయలైంది. ఈ స్కామ్పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోంది.
శిశు సంక్షేమం, ఆరోగ్య శాఖలతో సమన్వయంతో, నార్త్ జోన్ పోలీసులు, ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న వైద్యులు, ప్రైవేట్ ఆసుపత్రులు, అక్రమ రవాణాదారుల నెట్వర్క్పై దేశవ్యాప్తంగా చర్యలు ప్రారంభించారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేపట్టారు. అనేక సంవత్సరాలుగా చట్టబద్ధమైన సంతానోత్పత్తి చికిత్సల ముసుగులో పనిచేస్తున్న పిల్లల అక్రమ రవాణా సిండికేట్ను బహిర్గతం చేసేందుకు పోలీసులు విచారణను వేగవంతం చేశారు.