వైజాగ్ టెస్ట్ : రెండో టెస్టులోనూ రోహిత్ 'హిట్'.. భారీ స్కోరు దిశగా...

శనివారం, 5 అక్టోబరు 2019 (16:52 IST)
విశాఖపట్టణం కేంద్రంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన ఈ క్రికెటర్.. ఇపుడు రెండో ఇన్నింగ్స్‌లోనూ వంద పరుగులు చేశాడు. 
 
మొత్తం 133 బంతుల్లో 100 పరుగులను పూర్తి చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ 176 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా ఓపెనర్‌గా ఆడిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేసిన ఘనతను రోహిత్ సాధించాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో నిరాశ పరిచాడు. కేవలం 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. 
 
ఆ తర్వాత రోహిత్ శర్మకు జత కలిసిన పుజారా అద్భుతంగా ఆడి 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం భారత స్కోరు రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు. రోహిత్ 105, జడేజా 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తమ్మీద 281 పరుగుల ఆధిక్యంలో భారత్ క్రికెట్ జట్టు ఉంది. 
 
అంతకుముందు పర్యాటక సౌతాఫ్రికా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 431 పరులుగు చేసి ఆలౌట్ అయిన విషయం తెల్సిందే. సఫారీల ఇన్నింగ్స్‌లో ఎల్గర్ 160, డి కాక్ 111 పరుగులు చేసి రాణించిన విషయం తెల్సిందే. అలాగే, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 502 పరుగులు చేసి ఇదే స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. ఇందులో రోహిత్ శర్మ 176, మయాంక్ అగర్వాల్ 215 పరుగులు బాదారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు