నేడు భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20

మంగళవారం, 12 డిశెంబరు 2023 (13:11 IST)
సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆతిథ్య జట్టుతో మంగళవారం రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంతో పూర్తిగా రద్దు అయింది. దీంతో భారత్ విలువైన మ్యాచ్ ప్రాక్టీస్‌ను కోల్పోయినట్టయింది. త్వరలో ప్రారంభంకానున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌కు ముందు భారత్ ఆడే టీ20 మ్యాచ్‌లు కేవలం ఐదు మాత్రమే. అందులో ఒకటి వర్షం కారణంగా రద్దు అయింది. మిగిలిన నాలుగు మ్యచ్‌లలో సత్తా చాటాలని భావిస్తుంది. అందుకే మంగళవారం జరిగే రెండో మ్యాచ్ అయినా ఎలాంటి అంతరాయం లేకుండా జరగాలని టీమ్ మేనేజ్మెంట్‌తో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు. 
 
మరోవైపు, ఈ మ్యాచ్ బోణీ చేస్తే చివరి మ్యాచ్‌కు ఒత్తిడి లేకుండా బరిలోకి దిగొచ్చని భావిస్తున్నారు. కానీ ఎబేహలో మంగళవారం వర్ష సూచన ఉండడం ఆందోళన కలిగించే అంశం. మరోవైపు ఈ సిరీస్ కోసం 17 మంది ఆటగాళ్లను ఎంపిక చేసినా.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో వీరందరినీ పరీక్షించడం కుదరని విషయం. 
 
గిల్, సూర్యకుమార్, రింకూ సింగ్ టీ20 ప్రపంచకప్‌లో ఖాయంగా ఆడేవారిలో ఉండనున్నారు. అయితే ఫినిషర్‌గా రింకూకు జితేశ్ శర్మ నుంచి గట్టి పోటీ ఏర్పడింది. మిగిలిన బ్యాటర్లకు ఐపీఎల్ ప్రదర్శన కీలకం కానుంది. ముఖ్యంగా జైస్వాల్, రుతురాజ్ లీగ్ నిలకడగా ఆడాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు ఈ సిరీస్ ద్వారానే సెలెక్టర్లను ఆకర్షించాలని వీరు భావిస్తున్నారు. ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీస్‍‌లో ఇద్దరు ఓపెనర్లు విశేషంగా రాణించారు. 
 
కానీ గిల్ రాకతో ఒకరు ఓపెనింగ్ బెర్తును త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో రుతురాజ్ టాప్ స్కోరర్‌గా నిలువగా.. జైస్వాల్ పవర్‌ప్లేలో అద్భుత షాట్లతో విరుచుకుపడి తుఫాన్ ఆరంభాన్ని అందించాడు. కీపర్ స్థానం కోసం ఇషాన్, జితేశ్‌ల మధ్య పోటీ ఉంది. 
 
దక్షిణాఫ్రికా జట్టుకు కూడా టీ20 వరల్డ్ కప్ కోర్ టీమ్‌ను ప్రకటించేందుకు ఇంకా ఐదు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. దీనికితోడు డికాక్, బవుమా, రబాడ, ఎన్ఏడీ లేకుండానే ఈ సిరీస్ ఆడుతోంది. ఇక పేసర్లు జాన్సెన్, కొట్టీలను తొలి రెండు మ్యాచ్‌లకే ఎంపిక చేయడంతో వారికిది చివరి మ్యాచ్. ఆదివారం మ్యాచ్ రద్దు కావడంతో వారికి పెద్దగా మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. 
 
తుది జట్లు (అంచనా) భారత్ : శుభ్‌మన్ గిల్, జైస్వాల్ లేదా రుతురాజ్, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్, జడేజా, రవి బిష్ణోయ్, ముకేశ్, సిరాజ్, అర్ధదీప్ సింగ్. 
 
దక్షిణాఫ్రికా : హెన్రిక్స్, బ్రీస్కీ, స్టబ్స్, మార్క్రమ్ (కెప్టెన్), క్లాసెన్, మిల్లర్, ఫెలుక్వాయో, కేశవ్ మహ రాజ్, కొట్టీ, బర్గర్, షంసీ 
 
పిచ్, వాతావరణం సెయింట్ జార్జ్ పార్క్ మైదానంలో భారత జట్టుకు ఇదే తొలి టీ20 మ్యాచ్, ఇక్కడ ఆడిన ఆరు వన్డేల్లోనూ ఒక్కటే నెగ్గింది. పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉన్నా సమయం గడిచేకొద్దీ బౌలర్లకూ సహకరిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు