బయో-సెక్యూర్ బబుల్‌లోకి భారత క్రికెటర్లు.. జూన్ 2న ఇంగ్లండ్ గడ్డపైకి కోహ్లీ సేన

మంగళవారం, 25 మే 2021 (21:03 IST)
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా క్రికెటర్లు అడుగుపెట్టనున్నారు. ఇంగ్లాండ్ టూర్ ముంగిట టీమిండియా బయో- సెక్యూర్ బబుల్‌లోకి భారత క్రికెటర్లు ఎంటరయ్యారు. ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికైన భారత క్రికెటర్లు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. సెకండ్ డోస్ మాత్రం ఇంగ్లాండ్ గడ్డపై క్రికెటర్లు వేయించుకోనున్నట్లు బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. 
 
ఈ నేపథ్యంలో జూన్ 2న ఇంగ్లాండ్‌ గడ్డపైకి వెళ్లనున్న కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు.. అక్కడ సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడి.. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఢీకొట్టబోతోంది. ఈ మేరకు 20 మందితో కూడిన జట్టుని భారత సెలెక్టర్లు ప్రకటించారు. 
 
భారత టెస్టు జట్టులోకి ఎంపికైన ఆటగాళ్లు ముంబయికి చేరుకున్నారు. ఈ మేరకు కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్న ఆటగాళ్లు.. హోటల్‌లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పాటు చేసిన బయో- సెక్యూర్ బబుల్‌లోకి ఎంటరయ్యారు. ఏడు రోజుల పాటు ఆటగాళ్లు గదికే పరిమితం కానుండగా.. అందులో వారికి అవసరమైన సౌకర్యాల్ని ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 
 
ఈ ఏడు రోజుల వ్యవధిలో మరో రెండు సార్లు క్రికెటర్లకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రెండింటిలోనూ నెగటివ్ వచ్చిన ఆటగాళ్లు.. జూన్ 2న ఇంగ్లాండ్‌కి ఛార్టర్ ప్లైట్‌లో బయల్దేరి వెళ్లనున్నారు. ఒకవేళ ఈ పరీక్షల్లో పాజిటివ్ తేలిన క్రికెటర్.. టూర్ నుంచి తప్పుకోనున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు