ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపిన మహిళలు

ఆదివారం, 23 మే 2021 (11:06 IST)
దేశంలో కరోనా వైరస్ రెండో వైరస్ దెబ్బకు ఆరోగ్య శాఖలోని లోపాలన్నీ ఒక్కసారిగా వెలుగుచూశాయి. వైద్య సదుపాయాలే కాదు... అరకొరగా  పడకలు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని తేలింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ క్రమంలో దేశ‌వ్యాప్తంగా ఆక్సిజ‌న్‌కు డిమాండ్ పెరిగింది. అనేక మంది ఆక్సిజ‌న్ అంద‌క చ‌నిపోయారు. అయితే వివిధ రాష్ట్రాల్లో ఉన్న హాస్పిట‌ళ్ల‌కు ఆక్సిజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు భార‌తీయ రైల్వేశాఖ ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌ను న‌డుపుతున్న‌ది. ఇప్ప‌టికే ఆ రైళ్లు వేల మెట్రిక్ ట‌న్నుల లిక్విడ్‌ ఆక్సిజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేశాయి. 
 
తాజాగా జార్ఖండ్‌లోని టాటాన‌గ‌ర్ నుంచి ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ ఒక‌టి బెంగుళూరులోని వైట్‌ఫీల్డ్‌కు చేరుకున్న‌ది. అయితే ఆ రైలులో మొత్తం మ‌హిళా సిబ్బందే ఉన్నారు. రైలు డ్రైవ‌ర్‌, అసిస్టెంట్ డ్రైవ‌ర్‌, గార్డ్ .. అంద‌రూ మ‌హిళ ఉద్యోగులు కావ‌డం విశేషం. 
 
వైట్‌ఫీల్డ్‌కు చేరుకున్న ఆ రైలు మొత్తం 120 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ తీసుకొచ్చింది. ఆరు బోగీల‌తో రైలు బెంగుళూరు చేరుకుంది. భార‌తీయ రైల్వే శాఖ ఇప్ప‌టివ‌ర‌కు 13319 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను.. 814 ట్యాంక‌ర్ల‌లో.. 208 ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా స‌ర‌ఫ‌రా చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు