భుజానికి గాయ.. వన్డే సిరీస్‌కు దూరమైన శ్రేయాస్ అయ్యర్!

గురువారం, 25 మార్చి 2021 (08:20 IST)
భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులోని కీలక ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఆ తర్వాత జరుగనున్న ఐపీఎల్ టోర్నీకి కూడా దూరమయ్యాడు. దీనికి కారణం ఎడమ భుజానికి తగిలిన గాయమే. 
 
ఇంగ్లండ్‌తో మంగళవారం ముగిసిన తొలి వన్డేలో అయ్యర్‌ ఫీల్డింగ్‌ చేస్తుండగా గాయపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ) సారథైన శ్రేయాస్‌ గాయంపై ఆ జట్టు యాజమాన్యం కలవరపడతోంది. సర్జరీ చేసిన తర్వాత అతడు కోలుకో వడానికి కనీసం నాలుగు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. దీంతో ఐపీఎల్‌కు కూడా దూరంకానున్నాడు. శ్రేయాస్‌ గైర్హాజరీలో రిషభ్‌ పంత్‌, స్టీవ్‌ స్మిత్‌, అశ్విన్‌లలో ఎవరో ఒకరు డీసీ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. 
 
ఇక, ఇంగ్లండ్‌ జట్టు విష యానికి వస్తే కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ కుడి బొటన వేలు, చూపుడు వేలికి గాయం కాగా సామ్‌ బిల్లింగ్స్‌ ఎడమ భుజానికి తొలి వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తుండగా గాయమైంది. దీంతో శుక్రవారం జరగనున్న రెండో వన్డేలో ఈ ఇద్దరు ఆడేది అనుమానమే. వీరి స్థానంలో మ్యాట్‌ పార్కిన్సన్‌, రీస్‌ టోప్లే, లివింగ్‌స్టన్‌లలో ఇద్దరికి తుది జట్టులో అవకాశం దక్కవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు