ధర్మాశాల వేదికగా ఐదో టెస్ట్ మ్యాచ్ : కేఎల్ రాహుల్ దూరం!!

వరుణ్

బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (12:43 IST)
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో భారత్ మూడు మ్యాచ్‌లలో గెలుపొంది, సిరీస్‌ను సొంతంచేసుకుంది. ఈ నేపథ్యంలో ధర్మాశాల వేదికగా ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. అయితే, గాయం కారణంగా గత మూడు టెస్టులకు దూరంగా ఉన్న భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌ చివరి మ్యాచ్‌కైనా అందుబాటులోకి వస్తాడని ఆశించినా అలా జరగలేదు. గాయం నుంచి కోలుకోలేదని.. ఫిట్నెస్‌ సాధించలేదని తెలుస్తోంది. దీంతో చికిత్స కోసం అతడు లండన్‌ వెళ్తున్నట్లు సమాచారం.
 
ఇంగ్లీష్ జట్టుతో సిరీస్‌ కోసం ప్రకటించిన చివరి మూడు టెస్టుల బృందంలో కేఎల్‌ రాహుల్‌ పేరుంది. కానీ, ఫిట్నెస్‌ను నిరూపించుకుంటేనే తుది జట్టులో అవకాశం ఇస్తామని మేనేజ్‌మెంట్ ముందే షరతు విధించింది. ఇప్పుడు సిరీస్‌ ఎలానూ గెలిచాం కాబట్టి ఆటగాళ్ల గాయాల విషయంలో ఎలాంటి రిస్క్‌ తీసుకొనేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ముగిసిన పది రోజుల్లోనే ఐపీఎల్‌ ప్రారంభంకానుంది. 
 
ఆ మెగా లీగ్‌ తర్వాత టీ20 ప్రపంచ కప్‌ జరగనుంది. ఇప్పటికే షమీ లండన్‌లోనే శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. అతడు ఐపీఎల్‌కూ అందుబాటులో ఉండటం లేదు. మరి కేఎల్‌ ఫిట్నెస్‌ పరిస్థితి కూడా కొద్ది రోజుల్లోనే వెల్లడి కానుంది. మెగా లీగ్‌లో పాల్గొనడంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 
 
మరోవైపు, పని ఒత్తిడి నిర్వహణలో భాగంగా, నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా చివరి మ్యాచ్‌లో ఆడనున్నాడు. ధర్మశాల పేసర్లకు స్వర్గధామం. ఈ క్రమంలో అతడితోపాటు మరో ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్లకు అవకాశం ఇవ్వొచ్చు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన ఆకాశ్ దీప్‌, సిరాజ్‌ ఆడటం ఖాయమే. ఇద్దరు స్పిన్నర్లు అశ్విన్‌, జడేజాకే తుది జట్టులో అవకాశం ఉంటుంది. మూడో స్నిన్నర్‌ను తీసుకేనే ఛాన్స్‌లు తక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు