ధోనీ రిటైర్మెంట్ వార్తలను ఖండించిన బీసీసీఐ

గురువారం, 12 సెప్టెంబరు 2019 (18:20 IST)
సోషల్ మీడియాలో మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ వార్తలు వైరల్ అయ్యాయి. ధోనీ తన రిటైర్మెంట్‌పై ప్రకటన చేయనున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. ఒకటి రెండు రోజుల్లో ఆయన రిటైర్మెంట్‌పై ఒక స్పష్టమైన ప్రకటన చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. 
 
అయితే, ఈ వార్తలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఖండించింది. ఈ వార్తలు తమను ఆశ్చర్యానికి గురిచేశాయని తెలిపింది. ధోనీ రిటైర్మెంట్‌పై తమకు ఎలాంటి సమాచారం లేదని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. ఇదంతా తప్పుడు ప్రచారమేనని కొట్టిపడేశారు. దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన సందర్భంగా అడిగిన ప్రశ్నకు ఎమ్మెస్కే సమాధానమిచ్చారు. 
 
కాగా, ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ టోర్నీ తర్వాత ధోనీ రిటైర్మెంట్ చేయనున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. జట్టు కూడా ధోనీ కోసం కప్ గెలవాలని పరితపించింది. అయితే, ఫైనల్ ముంగిట బోల్తాపడింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి, టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ తర్వాత ధోనీ తన రిటైర్మెంట్‌పై ఎలాంటి ప్రకటన చేయకుండానే భారత సైన్యంతో కలిసి విధులు నిర్వహిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు