బీసీసీఐ చర్యతో బోలెడంత నష్టం వాటిల్లింది.. పీసీబీ గగ్గోలు

ఆదివారం, 1 అక్టోబరు 2017 (09:51 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనుసరిస్తున్న వైఖరి వల్ల తమకు బోలెడంత నష్టం వాటిల్లిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వాపోతోంది. అందువల్ల బీసీసీఐ నుంచి తమకు రూ.456 కోట్ల నష్టపరిహారాన్ని అందచేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి తలుపులు తట్టాలని నిర్ణయించింది 
 
ఇదే అంశంపై పీసీబీ ఛైర్మన్ నాజమ్ సేథీ మాట్లాడుతూ, 2014లో బీసీసీఐ.. పీసీబీతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎనిమిదేళ్ల (2015-2033) కాలంలో ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు పాక్ జట్టుతో టీమిండియా ఆడాల్సి ఉంది. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, రాజకీయ కారణాలతో బీసీసీఐ వెనక్కి తగ్గింది.
 
తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు బీసీసీఐ చేసుకున్న ఒప్పందాన్ని ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. ఒక్క ఐసీసీ నిర్వహించే టోర్నీల్లోనే భారత్ తమతో ఆడుతోందన్నారు. తటస్థ వేదికలపై భారత్‌తో ఆడేందుకు తమకు ఎటువంటి ఇబ్బంది లేదని, అయినప్పటికీ బీసీసీఐ అంగీకరించడం లేదన్నారు. 
 
బీసీసీఐ చర్యతో తమకు బోలెడంత నష్టం వాటిల్లిందని, కాబట్టి ఆ బోర్డు నుంచి తమకు నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా ఐసీసీని ఆశ్రయించనున్నట్టు తెలిపారు. మొత్తంగా 70 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 456 కోట్లు)ను బీసీసీఐ నుంచి నష్టపరిహారంగా ఇప్పించాల్సిందిగా ఐసీసీని కోరనున్నట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు