తమిళనాడులోని కరూర్లో పెను విషాదం చోటుచేసుకున్నది. శనివారం నాడు ఇక్కడ నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో పిల్లలు సహా ఇరవై మంది చనిపోయి ఉంటారని స్థానిక ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఇప్పటికే 500 మందిని ఆసుపత్రికి తరలించగా, ఇంకా 400 మందిని తీసుకువస్తున్నట్లు సమాచారం. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సీనియర్ పోలీసు అధికారి డేవిడ్సన్ దేవాశిర్వతం తెలిపారు.
విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రీ కజగం(టీవీకే) మద్దతుదారులు కనీసం ఆరు గంటలుగా అతని కోసం వేచి ఉన్నారు. ఐతే విజయ్ ర్యాలీ వేదిక వద్దకు ఆలస్యంగా చేరుకున్నాడు. దీనితో అప్పటికే కిక్కిరిసి వున్న జనవాహిన ఒక్కసారిగా తోపులాటతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. తొక్కిసలాటతో అక్కడ పరిస్థితి బీభత్సంగా మారింది. పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రమణియన్ కరూర్కు చేరుకున్నారు. పరిస్థితిని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కరూర్ జిల్లా కార్యదర్శి వి. సెంథిల్ బాలాజీని ఆదేశించారు.