పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలవడానికి ఆ జట్టులోని ఆల్రౌండర్లే ప్రధాన పాత్ర పోషించారని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నారు. ముఖ్యంగా జట్టులోని అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్రా జడేజా అద్భుత ప్రదర్శన చేశారని కితాబిచ్చారు. ఆ జట్టులో నాణ్యమైన బౌలర్లు లేకపోయినప్పటికీ విజయం సాధించారని ఆయన గుర్తుచేశారు.
ఐసీసీ రివ్యూలో చాంపియన్స్ ట్రోఫీ విజయంపై రికీ పాంటింగ్ మాట్లాడుతూ, రవీంద్ర జడేజా, అక్షర్, పాండ్యాలు వంటి ఆల్రౌండర్లు విశేషంగా రాణించారన్నారు. జట్టులో యువత, అనుభవం కలగలిపి ఉండటం వల్ల భారత్ను ఓడించడం కష్టమని టోర్నమెంట్ ప్రారంభంలోనే తాను చెప్పానని గుర్తుచేశారు. దానికితోడు ఫైనల్లో కెప్టెన్ తన జట్టు కోసం నిలబడి విజయాన్ని అందించాడని చెప్పారు.
ఈ టోర్నీలో భారత్ ఆడిన ఐదు మ్యాచ్లలోనూ ముగ్గురు ఆల్రౌండర్లను తుది జట్టులో ఆడించింది. తద్వారా బ్యాటింగ్ లైనప్ బలోపేతం కావడంతో పాటు బౌలింగ్లోను వెసులుబాటు కలిగిందని రికీ గుర్తుచేశాడు. టోర్నీ అసాంతం భారత జట్టు బాగా సమతూకంతో ఉందని, హార్దిక్, అక్షర్ వంటి ఆల్రౌండర్లు ఉండటంతో జట్టు కూర్పు మరింత బలంగా తయారైందని రికీ పాంటింగ్ వెల్లడించారు.