టీ20 జట్టులో రాహుల్‍‌కు మొండిచేయి.. బాలీవుడ్ నటుడు మద్దతు!!

ఠాగూర్

బుధవారం, 1 మే 2024 (10:18 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తాజాగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం భారత క్రికెట్ జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో జట్టును ఎంపిక చేయగా, ఇందులో కేఎల్ రాహుల్‌‍కు చోటుదక్కలేదు. ఈ నిర్ణయం పలువురిని తీవ్ర నిరాశకు లోనుచేసింది. ఈ క్రమంలో రాహుల్‌కు బాలీవుడ్ నటుడు రితేశ్ దేశముఖ్ అండగా నిలిచాడు. వరల్డ్ కప్ జట్టులో రాహుల్‌కు చోటుదక్కి ఉండాల్సిందంటూ ట్వీట్ చేశాడు. 
 
కేఎల్ రాహుల్ ప్రస్తుతం లక్నో సూపర్ జైంట్స్‌ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. పైగా, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. టోర్నీలో అత్యంత వేగంగా 400 పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. అయినా కూడా వరల్డ్ కప్ బృందంలో అతడికి చోటు దక్కకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక మంగళవారం ఎకానా స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా లక్నో సూపర్ జైంట్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. క్లిష్ట సమయంలో మార్కస్ స్టాయినిస్ నిలకడైన బ్యాటింగ్‌తో టీంను ఆదుకోవడంతో ఎల్ఎస్ఓ విజయతీరాలకు చేరింది. 
 
144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎల్ఎస్ఓ ఓపెనింగులోనే తడబడింది. ఆ తర్వాత వచ్చిన మిడిలార్డర్ కూడా నిరాశపరిచింది. ఈ దశలో రంగంలోకి దిగిన మార్కాయిస్ నిలకడైన ఆటతీరుతో జట్టుకు మద్దతుగా నిలిచాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి అతడు నెలకొల్పిన 58 పరుగుల భాగస్వామ్యం జట్టు విజయానికి కీలకంగా మారింది. చివరకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఎల్ఎస్ఓ.. 10 మ్యాచులకు 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు