బీసీసీఐ ఓ ప్రైవేట్ సంస్థ.. నేను వేరే దేశానికి క్రికెట్ ఆడొచ్చు కదా?: శ్రీశాంత్

శనివారం, 21 అక్టోబరు 2017 (10:50 IST)
తనను బీసీసీఐ నిషేధించిందనీ.. ఐసీసీ కాదని కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ అన్నాడు. 2013–ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో క్రికెటర్ శ్రీశాంత్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దుబాయ్‌‌లో జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్‌కు హాజరైన శ్రీశాంత్.. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను బీసీసీఐ నిషేధించిందనీ.. ఐసీసీ కాదని.. దీని ప్రకారం తాను భారత్‌లో మాత్రమే ఆడకూడదన్నారు. వేరే దేశానికి క్రికెట్ ఆడొచ్చు కదా అని ప్రశ్నించాడు. 
 
తన వయసు ఇంకా 34 సంవత్సరాలేనని.. శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆరేళ్ల పాటు క్రికెట్ ఆడే సత్తా తనకుందన్నాడు. వ్యక్తిగా తనకు క్రికెట్ అంటే ఇష్టమని.. అందుచేత క్రికెట్‌నే ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు. 
 
బీసీసీఐ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. అందుకే వేరే దేశానికి క్రికెట్ ఆడతా. తనపై నిషేధం కొనసాగించే నిర్ణయం బీసీసీఐకే వదిలేశానని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు.  ఒకవేళ బీసీసీఐ తనపై నిషేధాన్ని ఇలా కొనసాగిస్తే మాత్రం తన దారి తాను చూసుకుంటాననే శ్రీశాంత్ తెలిపాడు.
 
అయితే శ్రీశాంత్ బెదిరింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ, అతనికి కౌంటర్ ఇచ్చింది. ఐసీసీలో ఫుల్‌ మెంబర్‌ షిప్‌ ఉన్న ఏ దేశంలోనూ అతడు క్రికెట్‌ ఆడలేడని స్పష్టం చేసింది. దీనిపై చర్చ అవసరం లేదని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి స్పష్టం చేశారు. ఐసీసీలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశం లేదా బోర్డు ఒక ఆటగాడిపై నిషేధం విధిస్తే అతను ఐసీసీలో శాశ్వత సభ్యత్వం ఉన్న మరో దేశంలో గానీ, అసోసియేషన్‌‌లో కానీ ఆడేందుకు వీలుకాదన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు