2019 వరల్డ్ కప్ ఎలా గెలవచ్చంటే.. సెహ్వాగ్ ప్రజెంటేషన్.. ఆసక్తిగా విన్న క్రికెట్ దిగ్గజ త్రయం!

మంగళవారం, 11 జులై 2017 (15:40 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2019లో నిర్వహించే ప్రపంచ కప్ పోటీల్లో భారత్‌ను ఏ విధంగా విజేతగా నిలబెడతారన్న ప్రశ్నకు భారత క్రికెట్ జట్టు కోచ్‌ రేస్‌లో ఉన్న మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైనశైలిలో సమాధానమిచ్చాడు. ఈ ఢిల్లీ మాజీ క్రికెటర్ ఇచ్చిన ప్రజెంటేషన్‌ను కోచ్ సెలక్షన్ సభ్యుల త్రయం ఆసక్తిగా విన్నదట.
 
భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లే ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో మాజీ క్రికెటర్లు రవిశాస్త్రితో పాటు వీరేంద్ర సెహ్వాగ్, మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి కోచ్ సెలక్షన్ కమిటీ సభ్యులైన సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీలు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
 
ఇందులో ఈ సెలక్షన్ కమిటీ వేసిన ప్రశ్నలకు సెహ్వాగ్ ఇచ్చిన సమాధానం ఆసక్తిగా ఉందట. ముఖ్యంగా ఐసీసీ 2019లో నిర్వహించే ప్రపంచ కప్ పోటీల్లో భారత్‌ను ఏ విధంగా విజేతగా నిలబెడతారన్న ప్రశ్నకు సెహ్వాగ్ తనదైనశైలిలో సమాధానమిచ్చాడు. 'క్రికెట్ నెక్ట్స్'లో వచ్చిన కథనం ప్రకారం, 2019 వరల్డ్ కప్‌ను ఏ విధంగా గెలవచ్చన్న విషయమై సెహ్వాగ్ ఇచ్చిన ప్రజెంటేషన్‌ను సచిన్, సౌరవ్, లక్ష్మణ్‌లు ఎంతో ఆసక్తిగా విన్నట్టు తెలుస్తోంది. 
 
కోచ్ పదవికి సెహ్వాగే సరైన వ్యక్తని నిర్ణయానికి వచ్చిన వారు, ఆఖరుగా కోహ్లీ అభిప్రాయం తీసుకునేందుకే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఇక, కోచ్, కెప్టెన్ మధ్య సమన్వయం ఎలా కొనసాగిస్తావని అడిగిన ప్రశ్నకు ఇంటర్వ్యూలో పాల్గొన్న మిగతా వారికన్నా, సెహ్వాగ్ చెప్పిన సమాధానమే బాగుందని వీరు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి