గెలుస్తామన్న విశ్వాసమే విజయ సాధనకు కీలకం: విరాట్ విజయహాసం

సోమవారం, 30 జనవరి 2017 (05:44 IST)
అత్యంత సంక్లిష్ట భరిత క్షణాల్లో కూడా గెలుస్తామన్న విశ్వాసమే విజయసాధనలో చాలా కీలకమైన అంశమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వక్కాణించాడు. 30 బంతుల్లో 41 పరుగులు, చేతిలో 7 వికెట్లు ఉన్న ఇంగ్లండ్ జట్టును టి-20 రెండో మ్యాచ్‌లో మెరుపు బౌలింగ్‌తో పరాజయం పాలు చేసిన క్షణాలను విరాట్ విజయంపై విశ్వాసానికి అంకితమిచ్చాడు. 
 
డెత్ ఓవర్లో రెండు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ని నిర్ఘాంతపరచిన బుమ్రా అద్వితీయ బౌలింగ్  భారత్ విజయానికి మూల కారణం. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ల పొదుపు, నెహ్రా బౌలింగ్‌లో నిర్దిష్టత, బుమ్రా అద్భుత ప్రదర్శన నమ్మశక్యం కాని విజయాన్ని అందించాయని కోహ్లీ ప్రశంసించాడు
 
గెలుపు మీద ఆశ ఉన్న జట్టు మధ్య ఓవర్లలో అవకాశాలను చేజార్చుకోకూడదు. ముఖ్యంగా సీరిస్‌లో నిలవాల్సిన క్షణంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు బాలింగ్ చేసిన తీరు, మంచు కురుస్తున్న తరుణంలో నెహ్రా, బుమ్రా కలిసి చేసిన విన్యాసం అద్వితీయమనే చెప్పాలి. తానేం చేయాలో నెహ్రాకు ఖచ్చితంగా తెలుసు. ఇక బుమ్రా చివరి ఓవర్లో అద్భుతమే చేసాడు. రెండు పరుగులు, రెండు వికెట్లు. అద్భుత విజయం.. టీమిండియాకు కావలిసింది ఇదే.. ఓటమి అంచుల్లోనూ గెలుపు కోసం సత్తా ప్రదర్శించడం అన్నాడు కోహ్లీ
 
డెత్ ఓవర్లో బౌలింగ్ చేయడం ఎప్పటికైనా కఠిన పరీక్షే. అలాంటి పరిస్థితుల్లో గతంలో నేనేం చేశాను అన్నది ఈ మ్యాచ్ లోనూ గుర్తుకు తెచ్చుకున్నాను. మేం ఫస్ట్ ఇన్నింగ్సును చూశాం. బంతి స్లో అవుతోంది. బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీలు, స్లో బాల్ వేస్తే పరుగులు సాధించడం కష్టం. ఆ ప్రాతిపదికనే నేను బౌలింగ్ చేయాలనుకున్నాను. చివరి ఓవర్లో పొదుపుకు అదే కారణం అని బుమ్రా చెప్పాడు.
 

వెబ్దునియా పై చదవండి