ఐపీఎల్ రెండో సీజన్‌పై అనిశ్చితి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌పై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే అనేక సమస్యలు చుట్టుముట్టిన ఈ టోర్నీ తాజాగా రాజకీయ వివాదంలోకి జారుకుంది. ఐపీఎల్ వేదికల నుంచి జైపూర్‌ను తొలగించడం తాజాగా వివాదానికి దారితీసింది. ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ కావాలనే ఈ టోర్నీ వేదికల నుంచి జైపూర్ నుంచి తొలగించారని రాజస్థాన్ ప్రభుత్వం ఆరోపించింది.

అయితే ఐపీఎల్ యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఏదైతేనేం ఈసారి ఐపీఎల్ రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఐపీఎల్ కోసం యాజమాన్యం సిద్ధం చేసిన రెండు షెడ్యూల్‌లను భద్రతాపరమైన కారణాలతో కేంద్ర హోంశాఖ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో ఇటీవల ఐపీఎల్ కోసం నిర్వాహకులు తయారు చేసిన మూడో షెడ్యూల్‌లో జైపూర్, న్యూఢిల్లీ, విశాఖపట్నం వేదికలను తొలగించారు. జైపూర్‌ను తొలగించడంపై రాజస్థాన్ ప్రభుత్వం లలిత్ మోడీని బాధ్యుడిని చేసింది. దీనికి రాజస్థాన్ ప్రజలు మోడీని ఎప్పటికీ క్షమించరని పేర్కొంది.

రాజస్థాన్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో పరాజయం పాలైనందుకు ప్రతీకారంగా జైపూర్‌ను ఐపీఎల్ వేదికల నుంచి తొలగించారని రాజస్థాన్ హోంమంత్రి శాంతి ధారీవాల్ పేర్కొన్నారు. వారు ప్రతిపాదించిన తేదీల్లో రెండు తేదీలనే మార్చాలని రాజస్థాన్ ప్రభుత్వం కోరింది. అయితే దీనిపై మోడీ తమతో సంప్రదింపులే జరపలేదు.

ఎన్నికలు కూడా మ్యాచ్‌ల వంటివే. ఒక పార్టీ గెలిస్తే, మరో పార్టీ ఓడిపోతుంది. దీని అర్ధం రాష్ట్రాన్ని వదిలిపెట్టాలని కాదు. రాష్ట్రం నుంచి మ్యాచ్‌లు తొలగించాలని కాదు. ఇందుకు రాజస్థాన్ ప్రజలు మోడీని ఎప్పటికీ క్షమించరని వ్యాఖ్యానించారు. రాజస్థాన్ హోంమంత్రి వ్యాఖ్యలను ఐపీఎల్ నిర్వాహకులు ఖండించారు. ఆయన వ్యాఖ్యలు అసమంజసమైనవన్నారు. భద్రతాపరమైన పరిమితుల కారణంగా జైపూర్ నుంచి మ్యాచ్‌లు ఉపసంహరించడం జరిగిందని వివరణ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి