ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో భాగంగా గురువారం సచిన్-ధోనీ సేనల మధ్య కీలక సమరం జరుగనుంది. ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్లో మోచేయి గాయం కారణంగా నాలుగు ఐపీఎల్ మ్యాచ్లకు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్తో బుధవారం ప్రాక్టీస్లో నిమగ్నమైన మహేంద్ర సింగ్ ధోనీ, గురువారం ముంబై ఇండియన్స్తో జరిగే ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో ఆడుతాడని చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫన్ ఫ్లెమింగ్ అన్నారు. ఇంకా మహేంద్ర సింగ్ ధోనీ గాయం నుంచి కోలుకున్నాడని, తప్పకుండా ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగే మ్యాచ్లో ధోనీ పాల్గొంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. కుడిమోచేతి గాయం కారణంగా ఢిల్లీ డేర్డెవిల్స్, పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్, కోల్కతా నైట్రైడర్స్లతో జరిగిన నాలుగు మ్యాచ్ల్లో ధోనీ పాల్గొనలేదు. దీంతో సురేషై రైనా సీఎస్కే కెప్టెన్సీ సారథ్యం చేపట్టాడు.
ఇకపోతే.. ఇప్పటివరకు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగిన ముంబై ఇండియన్స్ రెండో స్థానానికి చేరుకుంది. టాప్లో నిలిచిన ముంబై ఇండియన్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క మ్యాచ్ విజయంతో వెనక్కి నెట్టింది.
ఐపీఎల్-3 లీగ్ మ్యాచ్లలో ఇప్పటికి మూడు విజయాలు, ఒకే ఒక్క ఓటమితో దూసుకెళుతున్న ముంబై ఇండియన్స్ తిరిగి ఐపీఎల్ పట్టికలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్తో గురువారం రాత్రి జరిగే మ్యాచ్లో విజయం సాధించి, తిరిగి అగ్రస్థానంలో నిలవాలని సచిన్ సేన హతహలాడుతోంది.