భారత రాష్ట్ర సమితి నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బీఆర్ఎస్ తన దారికి రావాల్సిందేనన్నారు.
'కేంద్ర జలశక్తిశాఖ మంత్రి.. ఇద్దరు ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో పండగ వాతావరణం కనిపించింది. మొదట బనకచర్ల అంశంపైనే చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్.. గోదావరి జలాలను అప్పజెప్పివచ్చారు. జరుగుతున్న నష్టం ఏమిటి? సీఎం అనుసరిస్తున్న వైఖరి ఏమిటి?. బనకచర్ల ప్రాజెక్టుపై జాగృతి పోరాడుతుంది.
టెలీమెట్రీల ఏర్పాటు అంశంలో విషయం లేదు.. కానీ, సీఎం దాన్ని తమ విజయంగా చెబుతున్నారు. బనకచర్ల వల్ల ఏపీకి కూడా లాభం లేదు, కుట్ర పూరితంగా కాంట్రాక్టర్ల కోసం చేపడుతున్న ప్రాజెక్టు అది. కాంగ్రెస్, భాజపా దారుణంగా మోసం చేస్తున్నాయి. బనకచర్లను తక్షణమే ఆపాలి.. లేదంటే జాగృతి న్యాయ పోరాటం చేస్తుంది. బీసీ రిజర్వేషన్లు, బనకచర్లపై అఖిలపక్షాన్ని సీఎం ఢిల్లీకి తీసుకెళ్లాలి' అని కవిత డిమాండ్ చేశారు.
న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయాన్ని సమర్థించినట్టు చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై రెండు బిల్లులు పెట్టాలని మొదట డిమాండ్ చేసింది కూడా తానేనని గుర్తుచేశారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి నేతలు స్పందించలేదని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.