ట్వంటీ-20 మ్యాచ్‌లో విండీస్ విజయభేరి

సోమవారం, 16 మార్చి 2009 (10:54 IST)
సొంత గడ్డపై సోమవారం పర్యాటక ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక ట్వంటీ-20 మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు విజయం సాధించింది. ఇంగ్లండ్ ఉంచిన 122 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 12 బంతులు ఉండగానే, నాలుగు వికెట్లను కోల్పోయి గెలుపొందింది. ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ మైదానంలో జరిగిన మ్యాచ్‌‌లో తొలుత టాస్ గెలిచిన విండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో బొపరా (13), డెవిస్ (27), స్టాస్ (22), పీటర్సన్ (12) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేక పోయారు. విండీస్ బౌలర్లలో ఎస్.జె.బెన్ నాలుగు ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విడిచాడు.

ఆ తర్వాత 122 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు 18 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. విండీస్ జట్టులో శర్వాణ్ 46 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 59 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అలాగే చందర్‌పాల్ (2), సిమ్మన్స్ (23 నాటౌట్), పోలార్డ్ (4 నాటౌట్)లు రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డును అర్థ సెంచరీతో జట్టును గెలిపించిన శర్వాణ్‌కు అందజేశారు.

వెబ్దునియా పై చదవండి