పంజాబ్‌పై సంచలన విజయం: సెమీస్‌లోకి చెన్నై కింగ్స్!

PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ధర్మశాలలో ఆదివారం జరిగిన 54వ లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌ను చెన్నై చిత్తుగా ఓడించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సేన ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్‌తో గెలిచి తీరాలన్న ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు విజృభించారు. ధోనీ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడటంతో 193 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలివుండగానే చెన్నై చేధించి, సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసింది.

పేలవమైన ఫామ్‌లో ఉన్న హేడెన్‌ 8బంతుల్లో 5పరుగులు మాత్రమే చేసి పొవార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కొద్ది సేపటికే విజయ్‌ (13; 11బంతుల్లో 2ఫోర్లు) కూడా పెవిలియన్‌ చేరాడు. దీంతో చెన్నై కష్టాల్లో పడింది.

ఈ సమయంలో క్రీజులోకి దిగిన రైనా-బద్రీనాథ్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఇద్దరి భాగస్వామ్యంతో చెన్నై స్కోరు పెరిగింది. వీరిలో రైనా రైనా(46;27 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్స్‌లు) 89 పరుగుల వద్ద మూడో వికెట్‌ రూపంలో పెవిలియన్‌ చేరాడు.

తర్వాత క్రీజులోకి దిగిన ధోనీ సహకారంతో బద్రీనాథ్‌ చెలరేగి ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తూ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వేగంగా ఆడిన బద్రీనాథ్‌(53; 36 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్స్‌లు) చావ్లా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

తర్వాత బాధ్యతను ధోనీ తనపై వేసుకున్నాడు. చెలరేగి ఆడిన ధోనీ 29 బంతుల్లోనే 5ఫోర్లు, రెండు సిక్స్‌లతో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో చెన్నై మరో నాలుగు బంతులు మిగిలి వుండగానే సంచలన విజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.

ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర ధోనీకి మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

వెబ్దునియా పై చదవండి