ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా ఏఫ్రిల్ 18న పంజాబ్ కింగ్స్ ఎలెవన్, చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగబోయే మ్యాచ్ను బౌద్ధుల ఆథ్యాత్మిక గురువు దలైలామా స్వయంగా వీక్షించనున్నారు. ధర్మశాలలో కొత్తగా నిర్మితమైన స్టేడియంను ప్రారంభించనున్న ఆయన, అందులో తొలిసారి జరుగబోయే ఈ మ్యాచ్ను గ్యాలరీనుంచి దర్శించనున్నారు.
ఈ విషయమై దలైలామా సెక్రటరీ టెన్జిన్ టక్లా మాట్లాడుతూ.. ఏఫ్రిల్ 18న కొత్తగా నిర్మితమైన స్టేడియం ప్రారంభోత్సవానికి, తొలి రోజున జరుగబోయే మ్యాచ్కు విచ్చేయాల్సిందిగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్పీసీఏ) పంపిన ఆహ్వానానికి లామా అంగీకరించినట్లు పేర్కొన్నారు.
ధర్మశాలలో నిర్వహించే ఓ పెద్ద అంతర్జాతీయ ఈవెంట్కు విచ్చేసేందుకు టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా అంగీకరించటమే విశేషమని తక్లా ఈ మేరకు వ్యాఖ్యానించాడు. మరోవైపు హెచ్పీసీఏ అధికార ప్రతినిధి సంజయ్ శర్మ మాట్లాడుతూ.. హెచ్పీసీఏ అధ్యక్షుడు అనురాగ్ థాకూర్, 74 సంవత్సరాల నోబల్ బహుమతి గ్రహీత అయిన లామాకు ఆహ్వానం పంపించినట్లు చెప్పారు. ఆ మహానుభావుడిచే కొత్తగా నిర్మితమైన స్టేడియంను ప్రారంభించనుండటం ఓ గొప్ప విషయమని శర్మ సంతోషం వ్యక్తం చేశాడు.