భారత వీసా పొందిన పాకిస్థాన్ సంతతి ఖవాజా

సెప్టెంబర్‌లో జరిగే ట్వంటీ20 ఛాంపియన్స్ లీగ్ టోర్నమెంట్‌కు గానూ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజాకు బుధవారం భారత వీసా లభించింది. పాకిస్థాన్‌లో జన్మించిన కారణంగా ఖవాజా‌కు వీసా ఇవ్వడం ఆలస్యం అయింది.

భారత హైకమీషన్ నుంచి ఈ 24 ఏళ్ల ఖవాజాకు క్లియరెన్స్ లభించిందని క్రికెట్ న్యూసౌత్‌ వేల్స్ బుధవారం సిడ్నీలో వెల్లడించింది. ఈ ట్వంటీ20 ఈవెంట్‌కు గానూ న్యూసౌత్ వేల్స్‌కు చెందిన 20 మంది జట్టులో ఉన్న ఖవాజా ఈ వారం ఎంపిక చేసే తుది 15 మంది జాబితాలో చోటుదక్కించుకున్నట్లయితే ఛాంపియన్స్ లీగ్ ఆడటానికి భారత్‌కు వస్తాడు.

ట్వంటీ20 ఛాంపియన్స్ లీగ్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 9 వరకు భారత్‌లో జరుగుతుంది. తన వీసా ఆలస్యం కావడంపై ఈ లెప్ట్ హ్యాండర్ మంగళవారం సోషల్ నెట్‌వర్క్ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

వెబ్దునియా పై చదవండి