హిట్టింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వంటీ-20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడు. భుజం గాయం కారణంగా టీ-20 ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి వీరు నిష్క్రమించాడు. దీంతో సెహ్వాగ్ స్థానంలో తమిళనాడు బ్యాట్సమన్ మురళీ విజయ్ పేరును ఖరారు చేస్తున్నట్లు సెలక్టర్లు ప్రకటించారు. అదేవిధంగా జట్టు వైస్ కెప్టెన్గా గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తాడని తెలిపారు.
ఈ సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి ఎన్. శ్రీనివాసన్ మాట్లాడుతూ... భుజం గాయంతో బాధపడుతున్న సెహ్వాగ్కి కనీసం మూడు వారాలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలుపారన్నారు. దీంతో ఐసీసీ ప్రపంచకప్ టీ-20లో అతని స్థానంలో స్థానంలో మరో ఆటగాడిని తీసుకునేందుకు ఐసీసీ టెక్నికల్ కమిటీ అనుమతించిందని తెలిపారు. దానిని అనుసరించి ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ సెహ్వాగ్ స్థానంలో మురళీ యాదవ్ను తీసుకున్నట్లు వెల్లడించారు.
చెప్పుకోదగ్గ విషయమేమిటంటే... 2009లో టి-20 ప్రపంచకప్ టోర్నమెంట్ సమయంలోనూ ఇంగ్లండ్కు ప్రయాణిస్తున్న సమయంలో సెహ్వాగ్ గాయాలపాలై ఆడలేకపోయాడు. మళ్లీ ఈ ఏడాది జరుగనున్న టి-20 టోర్నమెంట్లో సైతం గాయం కారణంగా పాల్గొనలేకపోతున్నాడు.