కరేబియన్ గడ్డపై జరుగనున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్లో పాల్గొనే భారతీయ జట్టును శుక్రవారం జాతీయ సెలక్టర్లు ప్రకటించారు. సీనియర్ ఆటగాళ్లు సైతం గాయాల బెడదతో సతమతమవుతున్న నేపథ్యంలో, వరల్డ్ కప్లో ఆడే ఆటగాళ్లను ఎంపిక చేయడం సెలక్షన్ కమిటీకి తలనొప్పిగా మారింది.
కానీ పటిష్టమైన జట్టును ఎంపిక చేయడంలో జాతీయ సెలక్టర్లు తీవ్రంగా కసరత్తు చేశారు. దీంతో పటిష్టమైన జట్టును ఎంపిక చేస్తూ.. ప్రపంచకప్లో ఆడే ఆటగాళ్ల ఎవరనే అంశంపై నెలకొన్న ఉత్కంఠకు శుక్రవారం తెరదించారు.
ఈ జట్టుకు సీనియర్ ఆటగాడు, టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్కు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇంకా వినయ్ కుమార్, పియూష్ చావ్లా అనే యువ క్రికెటర్లకు సెలక్షన్ కమిటీ స్థానం కల్పించింది.
ఇప్పటికే 30 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాబబుల్స్ జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రాబబుల్స్ జట్టులో స్థానం సంపాదించుకున్న బౌలర్లు ఇషాంత్ శర్మ, శ్రీశాంత్, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా అమిత్ మిశ్రాలకు సెలక్టర్లు ప్రపంచకప్లో ఆడే అవకాశం ఇవ్వలేదు. అలాగే బ్యాట్స్మెన్లలో ఢిల్లీ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి జట్టులో స్థానం దక్కలేదు.
కాగా.. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 16వ తేదీ వరకు వెస్టిండీస్లో జరిగే మూడో ట్వంటీ-20 వరల్డ్ కప్లో భారత్, ఆస్ట్రేలియా జట్లతో పాటు 12 దేశాలు పాల్గొంటున్నాయి.