ధోనీ ఆందోళనకు తెర... 11 గంటలకే మ్యాచ్ ప్రారంభం

న్యూజిలాండ్‌తో మొదటి టెస్ట్ మ్యాచ్‌ను మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించాలన్న సంప్రదాయ విరుద్ధ నిర్ణయం పట్ల భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆందోళనకు తెరపడినట్లైంది. షెడ్యూలు ప్రకారం బుధవారం ఉదయం 11 గంటలకే.. హామిల్టన్‌లోని సెడన్ పార్కులో టెస్ట్ ప్రారంభమవుతుందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది.

ఇదే విషయమే ధోనీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.... మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్ ప్రారంభించడం తమకు చాలా ఇబ్బందికరమనీ, రాత్రిపూట ఆడుతున్నట్టు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఎప్పుడు ముగుస్తుందో తెలియనంతగా మ్యాచ్ అలా కొనసాగుతూనే ఉంటుందనీ... 12 గంటలకు ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్ తానింత వరకూ ఆడలేదనీ, అది తప్పకుండా ఆందోళన కలిగించే విషయమే అని ధోనీ వాపోయాడు.

దీంతో... భారతదేశంలో మరింత మంది ప్రేక్షకులను ఆకర్షించే అవకాశాలతో సహా టెస్ట్ మ్యాచ్ షెడ్యూలింగ్ ఏర్పాట్లపై న్యూజిలాండ్ క్రికెట్, సోనీ టెలివిజన్ చర్చలు జరిపాయి. సోనీతో పాటు రెండు జట్ల ప్రతినిధులు, మ్యాచ్ అధికారులతో చర్చించిన మీదట మొదటి టెస్ట్ 11 గంటలకే ప్రారంభమవుతుందని ప్రకటించారు. నేపియర్ (మార్చి 26-30), వెల్లింగ్టన్ (ఏప్రిల్ 3-7)లలో జరిగే టెస్ట్ మ్యాచ్‌ల ప్రారంభ సమయాలను మాత్రం మరికొద్ది రోజుల్లో ఖరారు చేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి