కంగారూలపై ధోనీ సేన స్వారీ... ఆరేస్తున్న ఆస్ట్రేలియా "అపరిచితుడు"

బుధవారం, 6 మార్చి 2013 (21:27 IST)
FILE
ధోనీ సేన కంగారూలపై స్వారీ చేసి 2-0 పాయింట్లతో టెస్ట్ సిరీస్ నెగ్గడంతో ఆస్ట్రేలియాలో 'అపరిచితుడు'లో విక్రమ్ లెవల్లో అక్కడి మీడియా తమ జట్టు సభ్యులను ఉతికి ఆరేస్తోంది. బుధవారంనాడు తాటికాయంత అక్షరాలతో "pale warriors" అంటూ ధ్వజమెత్తింది. ఒక్క పేపరయితే ఫర్లేదు... చాలా పత్రికలు తూర్పారబడుతున్నాయి.

ఇక ఇక్కడ మాత్రం ధోనీపై పొగడ్తల జల్లు కురిపిస్తున్నాయి ఇక్కడ పేపర్లు. అయితే ధోనీ మాత్రం ఆ రికార్డులను తానేమీ పట్టించుకోవడం లేదనీ సెలవిచ్చాడు. దానికీ కారణముంది. ఎందుకంటే... విఫలమయితే మనవాళ్లు ఎలాంటి సూదంటు బాణాలు విడుస్తారో తెలియంది కాదు కదా.

'ఇదంతా గోరంతను కొండంత చేయడమే. ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లెవరు కూడా ఎవరు ఎన్ని మ్యాచ్‌లు గెలిచారనే విషయాన్ని చర్చించుకోరు. టెస్టు మ్యాచ్‌లు గెలవడమే ముఖ్యం. నంబర్లు మాకు ముఖ్యం కాదు' అని ధోనీ వ్యాఖ్యానించేశాడు.

ఇక టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టును నడిపించడంలో ధోనీ అద్భుతంగా రాణిస్తున్నాడని, అందువల్ల వచ్చే 2019 ప్రపంచ కప్ వరకు ధోనీయే టీమిండియా కెప్టెన్‌గా కొనసాగాలని అభిప్రాయపడ్డారు.

నిజానికీ ఇటీవల ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఓడిపోయింది. దీంతో ధోనీపై గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. కెప్టెన్‌గా ధోనీ బ్రేక్ తీసుకోవడం మంచిదన్న అభిప్రాయపడ్డాడు. అయితే, ప్రస్తుతం పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుతో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండు టెస్ట్ విజయాలను నమోదు చేసింది. దీంతో 2014తో పాటు 2019 వరల్డ్‌కప్ దాకా భారత కెప్టెన్‌గా ధోనీయే కొనసాగాలని గవాస్కర్ ఆకాంక్షించాడు.

వెబ్దునియా పై చదవండి