తనకు ఆఫీసులో సెలవు ఇవ్వలేదని నలుగురు సహోద్యోగులను ఓ ఉద్యోగి కత్తితో పొడిచాడు. ఈ దారుణ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో వెలుగుచూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమిత్ కుమార్ సర్కార్ అనే వ్యక్తి కోల్కతాలోని న్యూటౌన్ ప్రాంతంలోని కరిగరి భవన్లో సాంకేతిక విద్యా విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నారు. గురువారం సెలవు కావాలని దరఖాస్తు చేయగా, పై అధికారులు తిరస్కరించారు. ఈ విషయంపై ఆనయ తోటి ఉద్యోగులతో వాగ్వాదానికి దిగాడు.
ఈ క్రమంలో అతడు తనతో పాటు తెచ్చుకున్న కత్తితో నలుగురు ఉద్యోగులపై దాడి చేశాడు. ఆ తర్వాత కత్తి, రక్తపు మరకలతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఆ కార్యాలయానికి చేరుకుని గాయపడిన సహోద్యోగులు జయదేవ్ చక్రవర్తి, సంతను సాహా, సర్తా లతే, షేక్ సతాబుల్ అనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
దీనిపై సీనియర్ పోలీస్ అధికారి ఒకరు స్పందిస్తూ, 'నార్త్ 24 పరగణాల జిల్లా సోదేపూర్లో ఘోలా వాసి సర్కార్ సాంకేతిక విద్యావిభాగంలో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం సెలవు విషయమై తన సహోద్యోగులతో జరిగిన గొడవ నేపథ్యంలో అతను వారిపై కత్తితో దాడి చేసి, పారిపోవడానికి ప్రయత్నించాడు' అని పోలీసులు తెలిపారు. దీంతో సర్కార్ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. సర్కారుకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.