అనితరసాధ్యమైన ఆటతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన క్షణాల్లో టీమిండియా బెంగళూరులో జరిగిన రెండో టెస్టును ఆసిస్ జట్టునుంచి అమాంతంగా లాగేసుకుంది. ఆస్ట్రేలియాపై కోహ్లీ సేన 75 పరుగుల తేడాతో నెగ్గి సిరీస్ను 1-1తో సమం చేసింది. అయితే మ్యాచ్ గెలిచేందుకు కావాల్సిన 188 పరుగులను ఆసిస్ ఛేదిస్తున్న సమయంలో కెప్టెన్ స్మిత్ ఔట్ వివాదాస్పదంగా మారింది. మైదానంలోనే స్మిత్ డ్రస్సింగ్ రూమ్ సహాయం కోసం చూశాడు. వారికి సైగలు చేశాడు. అంపైర్ వెంటనే మైదానాన్ని వీడాల్సిందిగా కోరారు. అయితే మ్యాచ్ అనంతరం స్మిత్ ఈ విషయంపై మాట్లాడుతూ ఆ సమయంలో తన బ్రైన్ సరిగా పనిచేయలేదని చెప్పాడు. దీనిపై కోహ్లీ స్పందిస్తూ ఒకసారి అయితే అర్ధం చేసుకోవచ్చని కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు పలుసార్లు ఇలా చేస్తున్నారని అన్నాడు. స్లెడ్జింగ్ వరకు ఓకె గానీ ఆటలో కొన్ని దాటకూడని హద్దులు ఉంటాయని చెప్పాడు.
తాము గత మూడు రోజుల నుంచి గమనిస్తున్నామని, పలు సార్లు ఆస్ట్రేలియా జట్టు డీఆర్ఎస్ విషయంలో డ్రస్సింగ్ రూమ్ నుంచి సహాయం కోసం చూస్తుందని చెప్పాడు. దీనికి ఫుల్స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇలా చేయడాన్ని రెండు సార్లు గమనించాను. అప్పుడే అంపైర్కు ఫిర్యాదు చేశా. దీంతో స్మిత్ ఔటైనప్పుడు ఏం చేస్తున్నాడో అవగాహన ఉంది కాబట్టే అంపైర్ వెంటనే స్పందించారు. స్లెడ్జింగ్ చేయడం వరకు ఓకె కానీ కొన్ని దాటకూడని హద్దులు ఉంటాయి. స్మిత్ చేసిన దాన్ని మోసం అని అనను కానీ అది దాని కిందకే వస్తుందని అభిప్రాయపడ్డాడు కోహ్లీ.