కోలుకున్న భారత్: 285 పరుగుల ఆధిక్యం

సోమవారం, 22 డిశెంబరు 2008 (19:11 IST)
మొహాలీలో ముగిసిన నాలుగో రోజు ఆట ప్రారంభంలో త్వరితగతిన వికెట్లు కోల్పోవడంతో కుదుపుకు గురైన భారతజట్టు టీ విరామానంతరం కోలుకుని ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టుపై స్పష్టమైన ఆధిక్యత సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 302 పరుగులకే కట్టడి చేసిన భారత్ తర్వాత 44 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కలవరపాటుకు గురైంది.

టీ విరామానంతరం కోలుకుని వేగంగా పరుగులు సాధించి ఆట ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసి ప్రత్యర్థిపై 285 పరుగుల ఆధిక్యతలో నిలిచింది. ఆటముగిసేసరికి ఓపెనర్ గౌతమ్ గంభీర్ (44) యువరాజ్ సింగ్ (39) పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో రెండో టెస్టులో ఎలాగైనా విజయం సాధించి సీరీస్‌ను సమం చేయాలని తలిచిన ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి.

ఇక చివరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఆట డ్రా కావడం లేదా భారత్ విజయ సాధించడం రెండే అవకాశాలు మిగిలాయి. మంగళవారం ఆట పొగమంచు కారణంగా ఆట ఆలస్యంగా మొదలు కావచ్చని భావిస్తున్నారు. దీంతో ఫలితాన్ని సాధించగల సమయం భారత్‌కు దక్కకపోవచ్చని భావిస్తున్నారు.

భారత్ రెండో ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్, ద్రావిడ్, సచిన్, వివిఎస్ లక్ష్మణ్ వరుసగా 17,0,5,15 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు.

వెబ్దునియా పై చదవండి