చెన్నయ్లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు అయిదో రోజు మ్యాచ్లో ఆట రానురాను రసవత్తరంగా మారుతోంది. 387 పరుగులు లక్ష్య సాధనతో బరిలో దిగిన భారత్ వీరేంద్ర సెహ్వాగ్ నాలుగో రోజు చివరి సెషన్లో చేసిన మెరుపుదాడి బాసటగా విజయం వైపు కొనసాగే క్రమంలో వికెట్లు చేజార్చుకుంటోంది.
ఆట చివరిరోజైన సోవవారం మధ్యాహ్నానికి భారత్ 63 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టానికి 255 పరుగులు చేసి గెలుపు దిశగా పయనిస్తోంది. అయితే రాహుల్ ద్రావిడ్ యధాప్రకారంగా పేలవమైన ఆటతీరుతో వెనుదిరగడం, సచిన్, లక్ష్మణ్ నిలకడగా ఆడుతున్న క్రమంలో లక్ష్మణ్ 26 పరుగులకు అవుట్ కావడంతో భారత్ శిబిరంలో ఆందోళన చెలరేగింది.
క్రీజులో సచిన్ 49 పరుగులతో అర్థ సెంచరీకి చేరువలో ఉండగా యువరాజ్ సింగ్ 18 పరుగులతో బరిలో నిలకడగా ఆడుతున్నాడు. విజయానికి ఇంకా 127 పరుగులు అవసరం కాగా భారత్ వికెట్లు చేజార్చుకోకపోతే విజయం సాధించడం పెద్దగా కష్టం కాదని విమర్శకుల వ్యాఖ్య.
నాలుగో రోజు ఆట చివరి సెహ్వాగ్ మెరుపు వేగంతో 83 పరుగులు చేసి ఔట్ కాగా, అతడికి తోడుగా నిలిచిన గంభీర్ చివరి రోజైన సోమవారం 66 పరుగులు చేసి ఆండర్సన్ బౌలింగ్లో కాలిన్ ఉడ్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గత కొంత కాలంగా అన్ని రకాల క్రికెట్ పోటీల్లోను ఘోరంగా విఫలమవుతున్న రాహుల్ ద్రావిడ్ రెండో ఇన్నింగ్స్ లోనూ 4 పరుగులకే ప్లింటాప్ బౌలింగ్లో వెనుదిరిగి నిరాశపర్చాడు.
సచిన్ 49 పరుగులతో అర్థ సెంచరీకి అతి చేరువలో ఉండగా, యువరాజ్ తోడుగా నిలకడగా ఆడుతున్నాడు. ఇంగా ధోనీ, హర్భజన్లతో పాటు ఆరు వికెట్లు చేతిలో ఉన్న నేపథ్యంలో భారత్ విజయం సాధించే అవకాశాలే మెండుగా ఉన్నాయి.
తొలి ఇన్నింగ్స్ల్లో 316 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లండ్ జట్టు, రెండో ఇన్నింగ్స్లో 311 పరుగులకు తొమ్మిది వికెట్ల నష్టంతో డిక్లేర్ చేసింది. మరోవైపున తొలి ఇన్నింగ్స్లో 241 పరుగులకై ఆలౌట్ అయిన భారత్ రెండో ఇన్నింగ్స్లో సెహ్వాగ్ దూకుడు, గంభీర్ నిలకడ, సచిన్ ఆచితూచి చేస్తున్న బ్యాటింగ్తో కోలుకుని నాలుగు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో్ స్వాన్ 2, ఆండర్సన్ 1, ఫ్లింటాఫ్ 1 వికెట్ పడగొట్టారు.