భారత్-కివీస్ చివరి టెస్టుకు వర్షం అడ్డంకి తప్పదా..?
FILE
భారత్-న్యూజిలాండ్ల మధ్య అహ్మదాబాద్, హైదరాబాద్లలో జరిగిన తొలి రెండు టెస్టులు గెలుపోటములు లేకుండా డ్రా గా ముగిసిన నేపథ్యంలో, మూడో టెస్టుకు వరుణభగవానుడిచే అంతరాయం తప్పేలాలేదు.
నాగ్పూర్లో శనివారం జరుగనున్న కీలక చివరి టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. గురువారం కురిసిన భారీ వర్షంతో మైదానమంతా చిన్నపాటి కొలనుగా దర్శనమిస్తోంది. దీంతో వర్షం ధాటికి టీమ్ ఇండియా ప్రాక్టీస్కు బ్రేక్ పడింది.
సాయంత్రం కురిసిన వర్షం ధాటికి ధోనీ సేన హోటల్ గదులకే పరిమితమైంది. ఉదయం పూట వాతావరణం పొడిగానే ఉండడంతో న్యూజిలాండ్ ప్రాక్టీస్ సెషన్ నిర్విఘ్నంగా సాగింది. మరోవైపు మరో వారంపాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతుండటంతో కీలక చివరి టెస్టుకు వర్షం ముప్పు పొంచిఉంది.
ఇదిలా ఉంటే.. స్వదేశంలో ఆడినప్పుడల్లా భారత్ ప్రధానంగా ఆధారపడేది స్పిన్ బౌలింగ్పైనే. తొలి రెండు టెస్టుల్లో పిచ్లు అనుకూలించకపోవడంతోనే డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. మొతేరా, ఉప్పల్లాంటి పిచ్లపై 10 రోజులాడినా వేస్టేనని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
FILE
పక్కా ఫ్లాట్పిచ్ల చలవతో రెండు టెస్ట్లను డ్రా చేసుకోవాల్సి వచ్చింది. మన స్పిన్ ద్వయం హర్భజన్, ప్రజ్ఞాన్ ఓఝాలు వికెట్లు పడగొట్టడంలో చెమటోడ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. భజ్జీ 50 సగటుతో కేవలం 6 వికెట్లే పడగొట్టగా, ఓఝాకు 7 వికెట్లు దక్కాయి.
ఇకపోతే.. మూడు టెస్ట్ల సిరీస్లో రెండూ డ్రాగా ముగియడంతో తాజాగా అందరి దృష్టి శనివారం నుంచి జరిగే నాగపూర్ టెస్ట్పై నిలిచింది. సిరీస్ ఫలితం తేల్చేక్రమంలో నాగపూర్ వికెట్ బౌలర్లకు సహకరించాలని ధోనీ కోరుకుంటున్నాడు.