ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా తన ప్రతిష్టను నిలబెట్టుకోవాలంటే రేపటి నుంచి దక్షిణాఫ్రికా గడ్డపై జరుగనున్న టెస్టు సిరీస్లో అస్సలు ఓడిపోకూడదు. టెస్టుల్లో నెంబర్ వన్ జట్టుగా కొనసాగుతున్న టీమిండియా ఈ సిరీస్ గెలిచి తీరాల్సిందేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సిరీస్లో భారత జట్టు తన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. దక్షిణాఫ్రికా పిచ్లకు అనుగుణంగా భారత ఆటగాళ్లు ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టపరిచేలా ఆడాలి. ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్లో రెండో స్థానాన్ని దక్కించుకున్న దక్షిణాఫ్రికాను ఎదుర్కోవడం టీమిండియాకు గట్టి సవాలే.
దక్షిణాఫ్రికాతో ఆడే మూడు మ్యాచ్ల్లోనూ భారత్ ఓడిపోయినా నెంబర్ వన్ ర్యాంకుకు ఎలాంటి ఢోకా లేదు. అయినప్పటికీ తన నెంబర్ వన్ ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి మహేంద్ర సింగ్ ధోనీ సేన మెరుగ్గా ఆడాల్సిందే.
కాగా.. న్యూజిలాండ్తో సొంతగడ్డపై జరిగిన సిరీస్తో తిరిగి ఫామ్లోకి వచ్చిన గౌతం గంభీర్ బ్యాటింగ్ టెక్నిక్కు దక్షిణాఫ్రికా సిరీస్ అసలైన బలపరీక్షగా చెప్పవచ్చు. దక్షిణాఫ్రికా పిచ్లు సాధారణంగా బౌన్సీ పిచ్లు. సెంచూరియన్ సూపర్స్పోర్ట్ పార్క్ మైదానంలోని ఈ పిచ్ కాస్త బౌన్సీగా ఉంటుందని దాన్ని రూపొందించిన గ్రౌండ్మాన్ ఇదివరకే చెప్పాడు.
నాగ్పూర్లో జరిగిన టెస్టులో ఇలాంటి పిచ్పైనే ఆడినపుడు మోర్కెల్ ఒకే రోజు రెండుసార్లు గంభీర్ను ఔట్ చేసిన విషయాన్ని మరిచిపోకూడదు. అలాగే గురువారం ఉదయం బౌన్సీ పిచ్పై తనేంటో నిరూపించుకోవడానికి రాహుల్ ద్రావిడ్కు సూపర్ ఛాన్సు దొరికింది.
ఇటీవల ఒక మ్యాచ్ను కాపాడిన, మరో మ్యాచ్ను గెలిపించిన వీవీఎస్ లక్ష్మణ్.. అంతకుముందెప్పుడూ దక్షిణాఫ్రికాలో ఇలా మ్యాచ్ గెలిపించిన దాఖలాలు లేవు. దక్షిణాఫ్రికాలో ఇంతకు ముందెప్పుడూ లక్ష్మణ్ సెంచరీ సాధించలేదు. ఈసారి వీవీఎస్ జట్టును కాపాడటంతో పాటు సెంచరీ సాధిస్తే అది వ్యక్తిగతంగా రికార్డే అవుతుంది.
ఇక చాలా కాలం తర్వాత సురేశ్ రైనా దక్షిణాఫ్రికా పూర్తి టూర్లో పాల్గొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టోర్నమెంట్లో పాల్గొనడానికి రావడమే గాక, టైటిల్ విన్నింగ్ టీమ్లో రైనా భాగంగా ఉన్నాడు. అందువల్ల గౌతం గంభీర్తో పాటు సీనియర్ బ్యాట్స్మెన్లు, బౌలర్లు మానసికంగా ఆత్మవిశ్వాసంతో అంకితభావంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది.
దక్షిణాఫ్రికా విజయం ఖాయం అని హామీ ఇవ్వలేకపోవడానికి భారత బౌలర్ల త్రయం - జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, శ్రీశాంత్ - కారణం అని చెప్పవచ్చు. గత ఐదేళ్లుగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లతో పాటు భారత ఫాస్ట్ బౌలర్లు ఇక్కడి పరిస్థితులను తమకు అనుకూలంగా చక్కగా మలచుకుంటున్నారు.
పైగా భారత క్రికెట్ జట్టు కోచ్ గారీ కిర్స్టన్ దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ కావడం వల్ల ఇక్కడి పరిస్థితులపై ఆటగాళ్లకు సలహాలిచ్చే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పటికే టీమిండియాతో సమరానికి సై అంటున్న సఫారీలను మహేంద్ర సింగ్ ధోనీ సేన సమర్థవంతంగా ఎదుర్కుంటో లేదో అనే విషయాన్ని వేచి చూడాల్సిందే..!.