బౌలర్లు, వరుణుడు కొంపముంచారు... మా ప్లాన్ వర్కౌట్ కాలేదు : సర్ఫరాజ్

సోమవారం, 17 జూన్ 2019 (13:03 IST)
మాంచెష్టర్ మ్యాచ్‌లో భారత జట్టు చేతిలో ఓడిపోవడంపై పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందించాడు. తమ బౌలర్లు, వరుణుడు కలిసి తమ కొంప ముంచారనీ, ముఖ్యంగా, భారత బ్యాట్స్‌మెన్లను ఔట్ చేసేందుకు తాము రచించిన ప్లాన్ వర్కౌట్ కాలేదని చెప్పుకొచ్చాడు. 
 
ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 89 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్ అనంతరం సర్ఫరాజ్ స్పందిస్తూ, తాను టాస్‌ను గెలిచినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయామన్నారు. 
 
ముఖ్యంగా, కేవలం మూడు ఓవర్ల వ్యవధిలో నాలుగు కీలకమైన వికెట్లను కోల్పోవడం తమ కొంప ముంచిందన్నారు. ఈ మ్యాచ్‌‌లో క్రెడిట్‌ భారత బ్యాట్స్‌‌మెన్‌‌దేనని చెప్పాడు. తమ బౌలర్లు సరిగ్గా బౌలింగ్‌ చేయలేదని, తాను అద్భుతమైన ఆటగాడినని భారత ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి నిరూపించుకున్నాడని కితాబిచ్చాడు. 
 
రోహిత్‌ను సాధ్యమైనంత త్వరగా ఔట్ చేయాలని ప్రణాళికలు రూపొందించినా, అవి పనిచేయలేదన్నారు. బ్యాటింగ్‌‌తో పాటు బౌలింగ్‌‌లోనూ ఇండియా సమష్టిగా రాణించిందన్నారు. బాబర్, ఫఖార్, ఇమామ్‌లు బాగా ఆడినా, అదే ఊపును కొనసాగించలేకపోయామని, ఈ పరిస్థితి తమకు కఠినమే అయినా, మిగతా మ్యాచ్‌లలో రాణిస్తామన్న నమ్మకం ఉందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు