ఏంటయ్యా ఈ ఘోరం.. ఆంబులెన్స్‌లోనూ ఆడబిడ్డను వదలరా? భర్త కోసం వెళ్తే?

సెల్వి

గురువారం, 5 సెప్టెంబరు 2024 (19:28 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఓవైపు అంబులెన్స్ వెనక సీట్లో రోగి ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. ముందుసీట్లో ఆ రోగి భార్య బాధలో వుందన్న విషయాన్ని మరిచి.. అంబులెన్స్ డ్రైవర్ ఆమెపై లైంగిక వేధింపులకు గురి చేశాడు. అతడికి ఆంబులెన్స్ సహాయకుడు కూడా తోడయ్యాడు. 
 
ఆమె ఆంబులెన్స్ డ్రైవర్, అతడి సహాయకుడి చర్యలకు అడ్డం తిరగడంతో నడి రోడ్డుపైనే రోగిని దించేసి వెళ్లిపోయారు. పోలీసులకు ఫోన్ చేసి భర్తను వేరే ఆసుపత్రికి తరలించుకునే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది.. ఆక్సిజన్ అందక ఆ పేషెంట్ ప్రాణాలు కోల్పోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. సిద్ధార్థనగర్‌కు చెందిన మహిళ ఆగస్టు 28న అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను ఘాజిపూర్‌‌లోని ఆరావాళి మార్గ్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించింది. అక్కడ చికిత్స ఖర్చులను తట్టుకోలేక వైద్యుల అనుమతితో భర్తను ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ప్రైవేట్ అంబులెన్స్‌ను మాట్లాడుకుని భర్తతో ఇంటికి బయలుదేరింది. 
 
అప్పటికే ఆ మహిళపై కన్నేసిన అంబులెన్స్ డ్రైవర్, అతడి సహాయకుడు.. అర్ధరాత్రి ప్రయాణం కావడంతో పోలీసులు అపకుండా ఉండాలంటే ముందు కూర్చోవాలని బాధితురాలికి చెప్పారు. వారి దుర్బుద్ధిని పసిగట్టలేక బాధితురాలు అలానే చేసింది.
 
మార్గమధ్యంలో బాధితురాలితో డ్రైవర్, అతడి సహాయకుడు అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీంతో భయాందోళనలకు గురైన బాధితురాలు, ఆమె భర్త, సోదరుడు కేకలు వేశారు. గొడవ జరిగేలా ఉందని భావించిన డ్రైవర్.. చవానీ పోలీస్ స్టేషన్ రోడ్డులో అంబులెన్స్‌ను ఆపేసి పేషెంట్‌ను కిందికి దింపారు. ఆక్సిజన్ తొలగించి రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయారు. 
 
పోతూ పోతూ బాధితురాలి దగ్గర ఉన్న రూ.10 వేలతో పాటు నగలను బలవంతంగా లాక్కుని పోయారు. ఈ ఘటనలో ఆక్సిజన్ అందక బాధితురాలి భర్త పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో ఘాజీపూర్‌కు చెందిన ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు