ఇటీవలికాలలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండాపోతోంది. కేవలం పోకిరీలు, అకతాయిలు, ప్రేమోన్మాదులు మాత్రమే కాదు... విద్యావంతులు, పోలీస్ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం మహిళలను వేధిస్తున్నారు. ముఖ్యంగా చట్టాన్ని పరిరక్షిస్తూ సమాజంలోని పౌరులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే నేరాలు ఘోరాలకు పాల్పడుతున్నారు. తాజాగా గతంలో ఏర్పడిన ముఖపరిచయంతో న్యూడ్ ఫోటోలు పంపాలంటూ ఓ మహిళను ఓపెన్ జైలు జైలర్ వేధింపులకు పాల్పడ్డాడు. తాజాగా ఓ జైలు అధికారి కూడా ఓ మహిళను వేధించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం మేరకు.. విశాఖపట్టణానికి చెందిన ఓ గృహిణికి స్నేహం పేరుతో అనంతపురం జిల్లా ఓపెన్ జైలు జైలర్ సుబ్బారెడ్డి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ చేశాడు. ఈ విషయం తెలిసిన ఆమె భర్త సుబ్బారెడ్డిని మందలించారు. ఒక రోజు సుబ్బారెడ్డి నేరుగా ఆమెకు ఫోన్ చేసి డబ్బులు పంపిస్తానని బ్యాంకు ఖాతా నంబరు చెప్పాలని బలవంతం చేశాడు. ఆ తర్వాత న్యూడ్ ఫోటోలు షేర్ చేసి అలాంటి ఫోటోలు పంపాలని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫోన్ చేశారు.
సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో వేధింపులు నిజమని తేలింది. దీంతో మార్చి 22వ తేదీన సుబ్బారెడ్డిపై కేసు నమోదైంది. 2019-21 మధ్య సుబ్బారెడ్డి విశాఖపట్టణంలో పనిచేసి సమయంలో మహిళతో ఏర్పడిన ముఖ పరిచయంతోనే ఈ వేధింపులకు పాల్పడినట్టు తేలింది. మరోవైపు, కేసు నమోదు చేసిన పోలీసులు.. సుబ్బారెడ్డిని విచారణకు పిలవగా ఆయన డుమ్మాకొట్టారు. దీంతో ఆయన కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆయన అప్పటికే పరారైనట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.