ప్రియురాలి కోసం కొలంబియా వెళ్లిన ఆంధ్రా కుర్రోడు.. అనుమానాస్పద మృతి

ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (09:54 IST)
ప్రియురాలి కోసం కొలంబియా వెళ్లి ఆంధ్రా కుర్రోడు ఒకడు శవమైతేలాడు. ఈ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన బేతపూడి సుధీర్ కుమార్ (జోషి) ప్రభుత్వ ఉపకార వేతనంతో స్పెయిన్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఇటీవలే ఇంటికి చ్చాడు.
 
అయితే, సుధీర్ కుమార్ గతంలో కొలంబియా జాతీయురాలు జెస్సికాతో సహజీవనంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో, స్పెయిన్ వెళుతున్నానంటూ జి.కొండూరు నుంచి బయల్దేరిన సుధీర్ కొలంబియా వెళ్లినట్టు తెలిసింది. పుట్టినరోజు నేపథ్యంలో తన ప్రేయసి జెస్సికాను సర్‌ప్రైజ్ చేద్దామని కొలంబియా వెళుతున్నానని సుధీర్ తన సోదరి జ్యోత్స్నకు తెలిపాడు.
 
అయితే, ఐదు రోజుల కిందట జెస్సికా... జ్యోత్స్నకు ఫోన్ చేసి సుధీర్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. అంతేకాదు, చనిపోయే ముందు సుధీర్... భారత్‌లోని తన సోదరుడితో మాట్లాడిన వీడియో కాల్ క్లిప్పింగ్‌ను కూడా జ్యోత్స్నకు పంపించింది.
 
కాగా, సుధీర్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన సోదరుడికి, జెస్సికాతో స్పర్థలు ఉన్నాయని సోదరి జ్యోత్స్న చెబుతోంది. తమ ఆర్థికస్థితి అంతంతమాత్రమేనని, సుధీర్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు సాయపడాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు