మాజీ ప్రియురాలిపై యువకుడి పైశాచికం... ఫ్రెండ్స్‌కు అప్పగించి...

బుధవారం, 2 ఆగస్టు 2023 (17:04 IST)
కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఓ యువకుడు కిరాతక చర్యకు పాల్పడ్డాడు. మాజీ ప్రియురాలిని వేధించి, ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా, తన స్నేహితులతో సన్నిహితంగా మెలగాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అంతేకాకుండా అందుకోసం స్నేహితుల నుంచి డబ్బును కూడా వసూలు చేశాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగుళూరు నగరంలోని విద్యారణ్యపురకు చెందిన ఆండీ జార్జ్ అనే వ్యక్తి ఒక ప్రైవేటు పాఠశాలలో డాన్స్‌ టీచర్‌‌గా పనిచేస్తున్నాడు. ఈశాన్య బెంగళూరుకు చెందిన ఒక యువతి (23)తో రెండేళ్ల క్రితం సోషల్‌ మీడియాలో అతడికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అప్పటి నుంచి వారిద్దరూ తరుచుగా కలుసుకుంటూ వచ్చారు. 
 
అయితే, కొన్నాళ్లకు అతడి ప్రవర్తన యువతికి నచ్చకపోవడంతో దూరం పెట్టింది. అప్పటి నుంచి ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలను చూపించి యువతిని బెదిరించాడు. ఆ విధంగా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతటితో అతడి ఆగడాలు ఆగలేదు. తన స్నేహితులైన సంతోష్‌ (28), శశి కుమార్‌ (30)లతో కూడా సన్నిహితంగా ఉండాలని కోరాడు. దానికి యువతి నిరాకరించింది. వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానంటూ మళ్లీ బెదిరించి.. బలవంతంగా ఆమెను ఒప్పించాడు. 
 
ఆమె అతడి స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో వీడియోలను కూడా రికార్డు చేశాడు. స్నేహితుల నుంచి కూడా డబ్బులు వసూలు చేశాడు. కొన్ని రోజులకు ఆమె ఆ ముగ్గురిని కలవడం మానేయడంతో.. ఫొటోలు, వీడియోలను జార్జ్‌ తన స్నేహితులకు షేర్‌ చేశాడు. వారి వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. జార్జ్‌ నుంచి ల్యాప్‌టాప్‌, ఫొన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు