కోడలిపై రోకలితో దాడి చేసి చంపేసి మామ!!

వరుణ్

మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (09:54 IST)
కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటుచేసుకుంది. గ్రామీణ ఎస్ఐ సురేశ్‌ తెలిపిన వివరాలు... విశాఖపట్నానికి చెందిన ఎమ్‌.శ్రీనివాస్‌, సత్యకుమారిల ఏకైక కుమార్తె నాగ శ్రావణిని ఐదేళ్ల కిందట జగన్నాథపురం గ్రామానికి చెందిన లక్కోజు కేశవరావు (విశ్రాంతి రైల్వే ఉద్యోగి), సూర్యకుమారిల కుమారుడు శ్రీనివాసరావుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమారుడు రిశాంత్‌ కుమార్‌(4), కుమార్తె జస్విత సూర్యశ్రీ(3) సంతానం ఉన్నారు. 
 
శ్రీనివాసరావు రెండేళ్ల కిందట జీవనోపాధికి దుబాయి వెళ్లారు. నాగ శ్రావణి తన పిల్లలతో ఇంట్లోనే ఉంటున్నారు. ఆదివారం గ్రామంలో ఒక శుభకార్యానికి అత్తమామలతో కలిసి వెళ్లారు. ఇంటికొచ్చాక తన కుమారుడి నడుముకు ఉండాల్సిన వెండి మొలతాడు కనిపించకపోవడాన్ని గమనించారు. అజాగ్రత్తగా ఉంటున్నావంటూ కుమారుడిని కొట్టారు. ఈ నేపథ్యంలో కేశవరావు ఆమెపై గొడవకు దిగారు. 
 
అదే రోజు రాత్రి నిద్రిస్తున్న శ్రావణి తలపై అతడు పచ్చడిబండతో బాదడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియాసుపత్రికి తరలించారు. నిందితుడు కేశవరావు తోపాటు అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. తరచూ తన కుమార్తె నాగశ్రావణిని ప్రతి చిన్న విషయానికీ మామ కేశవరావు నిందిస్తూ ఉంటాడని మృతురాలి తండ్రి ఎమ్‌.శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తంచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు