15 యేళ్ళ బాలికపై 29 మంది మానవ మృగాల లైంగికదాడి...

శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (11:40 IST)
మహారాష్ట్రలోని థానెలో ఓ దారుణం వెలుగు చూసింది. 15 యేళ్ళ బాలికపై 29 మంది మానవ మృగాలు లైంగికదాడికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ఈ మానవమృగాలంతా కలిసి ఆ బాలికను అత్యంత క్రూరంగా హింసించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
బుధవారం రాత్రి బాధితురాలు డోంబివాలిలోని మాన్పాడ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు బాలిక స్నేహితుడే కావడం గమనార్హం. ముందుగా ఈ ఏడాది జనవరిలో మైనర్‌పై అఘాయిత్యానికి పాల్పడి, ఈ దృశ్యాలను వీడియో తీశాడు. 
 
ఈ వీడియోను అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ మిగతావారు ఆమెపై పదేపదే లైంగిక దాడికి పాల్పడ్డారు. అలా జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు ఏకంగా తొమ్మిది నెలల పాటు 29 మంది తనపై లైంగికదాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 26 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. అరెస్టు చేసిన వారందరిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఏసీపీ దత్తాత్రేయ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు