భాగ్యనగరిలో నరబలి.. ఎముకలు విరిచి బకెట్‌లో కుక్కి...

శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (11:47 IST)
హైదరాబాద్ నగరంలో నరబలి జరిగినట్టు తెలుస్తుంది. ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ బాలుడిని చంపేసిన కిరాతకులు ఎముకలు విరిచి బకెట్‌లో కుక్కేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలోని అల్లాదున్‌ కోటిలో నివసించే రెడీమేడ్‌ దుస్తుల వ్యాపారి వసీంఖాన్‌ కుమారుడు (8)ను స్థానికంగా నివసించే ఫిజాఖాన్‌ అనే ఓ హిజ్రా హత్య చేసినట్లు పోలీసులు సందేహిస్తున్నారు. 
 
చిట్టీల వ్యాపారం నిర్వహించే ఫిజాఖాన్‌ వద్ద వసీంఖాన్‌ చిట్టీలు వేశాడు. దీనికి సంబంధించిన డబ్బును ఫిజాఖాన్‌ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య గురువారం వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం వసీంఖాన్‌ కుమారుడిని నలుగురు వ్యక్తులు బస్తీలోని ఓ వీధిలో కిడ్నాప్ చేశారు. 
 
తన కుమారుడు కనిపించకపోవడంతో తండ్రి వసీంఖాన్‌ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీ ఫుటేజీల ఆధారాలతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారు అసలు విషయం చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. 
 
బాలుడిని హత్య చేసి, మృతదేహాన్ని జింకలవాడ సమీపంలోని ఓ నాలాలో వేసినట్లు నిందితులు అంగీకరించడంతో గురువారం అర్థరాత్రి పోలీసులు స్థానికుల సాయంతో నాలాలో వెతికారు. ఓ ప్లాస్టిక్‌ సంచిలో మృతదేహం ఉన్నట్లు గుర్తించి వెలికి తీశారు. బాలుడిని హత్య చేసిన నిందితులు.. ఎముకలను ఎక్కడిక్కడ విరిచి ఓ బకెట్‌లో కుక్కారు. 
 
బకెట్‌ను ప్లాస్టిక్‌ సంచిలో తీసుకుని వెళ్లి నాలాలో విసిరేసినట్లు తెలిసింది. బాలుడిని నరబలి ఇచ్చినట్లుగా బస్తీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిట్టీ డబ్బుల గొడవ కారణంగానే హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు