మహిళపై లైంగిక దాడికి పాల్పడిన పోలీస్ అధికారుల వ్యాను డ్రైవర్లు

శుక్రవారం, 29 డిశెంబరు 2023 (13:13 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ 32 యేళ్ల మహిళపై పోలీస్ ఉన్నతాధికారుల కార్లు డ్రైవర్లు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ఆ ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేశారు. ఈ ఘటన గురువారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జార్ఖండ్ రాష్ట్రంలోని పాలము జిల్లాలో డిప్యూటీ కమిషనర్ డ్రైవర్‌గా ధర్మేంద్ర కుమార్ (30), పాలము ఎస్పీ డ్రైవర్ ప్రకాశ్ కుమార్ (40)లు పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ మొబైల్ రీచార్జ్ కోసం దల్తోంగంజ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ దుకాణానికి వెళుతుండగా, ఆమెను గమనించిన ఈ ఇద్దరు డ్రైవర్లు ఆమెతో మాటలు కలిపారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ సమీపంలోని రెసిడెంట్స్ క్వార్టర్స్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించారు. 
 
అయితే, బాధిత మహిళ ఆ ఇద్దరు కామాంధులపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటన జరిగిన రెండు గంటల్లోనే నిందితులను అరెస్టు చేసారు. మహిళపై లైంగికదాడి జరిగిన మాట నిజమేనని పాలము ఎస్పీ రీష్మా రమేశన్ నిర్ధారించారు. అరెస్టు చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు