పిల్లాడి మానసిక స్థితి సరిగా లేదని యూ ట్యూబ్‌లో నెంబర్లు చూసి ఫోన్, రూ. 9.73 లక్షలు పేమెంట్ తీసుకుని ఫోన్ స్విచాఫ్

ఐవీఆర్

శనివారం, 6 ఏప్రియల్ 2024 (13:20 IST)
నమ్మేవారు వుంటే పచ్చిగడ్డిలో కూడా అద్భుతమైన శక్తి వుందని లక్షల్లో అమ్ముకునే కాలం నడుస్తోంది. అందులోనూ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో వుండటంతో మోసగాళ్లకు మోసం చేయడానికి కష్టపడాల్సిన అవసరం కూడా వుండటంలేదు. చాలా సులభంగా బోల్తా కొట్టించేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఇలాగే రూ. 9.73 లక్షలు మోసపోయాడు.
 
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. తెలంగాణలోని మహబూబ్ నగర్ గోపాల్ పేటకు చెందిన రాజు ఆటో డ్రైవర్. అతడి కుమారుడు కొన్నేళ్లుగా మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఎన్నో వైద్యాలు చేయాంచాడు. అయినా ఫలితం లేకపోయింది. యూ ట్యూబ్‌లో మతిస్థిమితం లేనివారికి క్షుద్రపూజలు చేసి నయం చేస్తామని, అవసరమైన వారు తమ ఫోన్ నెంబర్లను సంప్రదించాలన్న వీడియో చూసి ఆ నెంబర్లకు కాల్ చేసాడు రాజు. దీనితో ఆ నెంబర్ల నుంచి మాట్లాడిన వ్యక్తులు ఏపీలోని గుంటూరు జిల్లా నుంచి వచ్చారు.
 
గోపాల్ పేటకు వచ్చి రాజును సంప్రదించి అతడి కుమారుడి మతిస్థిమితం సమస్యను తగ్గించేస్తామని నమ్మబలికారు. క్షుద్రపూజలు చేసేందుకు డబ్బులు కట్టమని అతడి నుంచి దశలవారీగా రూ. 9.73 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత ఒకరోజు రాజుతో పాటు అతడి కుమారుడిని విజయవాడకు తీసుకుని వచ్చి అక్కడ క్షుద్రపూజలు చేసి... తెల్లారేసరికి అంతా పోతుందని చెప్పి వారిని పంపేసారు.
 
ఐనా తమ కుమారుడి మానసిక స్థితి యథాతధంగానే వుండటంతో రాజు వారికి ఫోన్ చేసాడు. వారు స్పందించకపోగా ఫోన్ స్విచాఫ్ చేసారు. దీనితో తను మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను గుంటూరు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 7 లక్షల నగదు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు