ఏలూరు జిల్లాలో వలంటీర్ అకృత్యం... బాలికపై అత్యాచారం

బుధవారం, 18 అక్టోబరు 2023 (09:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలంటీర్ల అకృత్యాలు యధేచ్చగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అనేక మంది జీవితాలను పలువురు వలంటీర్లు నాశనం చేశారు. ఇంకొందరు హత్యలు చేశారు. ఇపుడు మరో వలంటీర్ ఓ బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. ఒంటరిగా ఉన్న బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఆధార్ కార్డు నెపంతో ఆ బాలిక ఇంటికి వెళ్లిన వలంటీర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా ఈ దారుణం ఏపీలోని ఏలూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు గ్రామం వదిలి పారిపోయాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో నీలాపు శివకుమార్ అనే వలంటీర్ ఓ బాలిక వెంటపడి వేధించేవాడు. రెండునెలల క్రితం ఎవరూ లేనప్పుడు తల్లిదండ్రుల ఆధార్ కార్డులు కావాలని ఇంట్లోకి వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానంటూ తర్వాత పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
పాఠశాలకు సెలవులు రావడంతో బాలిక తన పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమె వైద్యపరీక్షలు చేయించగా బాలిక గర్భవతి అని తేలడంతో తల్లిదండ్రులకు తెలిసి వారు వాలంటీరును నిలదీశారు. దీంతో అతను రూ.10 వేలు ఇస్తాను.. కడుపు తీయించుకోవాలని చెప్పగా, రెండు కుటుంబాల మధ్య వివాదం జరిగింది. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో పెళ్లికి అంగీకరించాడు. ఏర్పాట్లుచేసుకున్నాక పెళ్లికి ముందురోజు పరారయ్యాడు.
 
బాలిక తల్లిదండ్రులు ఏలూరు దిశ పోలీసుస్టేషన్‌కు వెళ్లగా అధికారులు లేరంటూ ఫిర్యాదు తీసుకోలేదు. దెందులూరు పోలీస్టేషన్‌కు వెళ్లినా.. కేసు నమోదు చేయలేదు. చాలాకాలం పోలీసులు పట్టించుకోకపోవటంతో బాధితులు జగనన్నకు చెబుదాం, స్పందన, 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో ఎట్టకేలకు అక్టోబరు 5వ తేదీన కేసు నమోదు చేశారు. 
 
దర్యాప్తులో కాలయాపనపై పోలీసులను బాలిక బంధువులు అడగగా... మీరే నిందితుడిని వెతికి పట్టుకొస్తే తాము చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు నిర్ఘాంతపోయారు. వాలంటీరుకు స్థానిక వైకాపా నేత అండ ఉండటంతో పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని, కేసు నమోదుకు కూడా తీవ్ర జాప్యం చేశారని వారు ఆరోపిస్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు