బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మూఢ నమ్మకం పేరుతో ఓ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులను కొట్టి చంపేశారు. ఆ తర్వాత శవాలను దహనం చేశారు. ఈ దారుణ ఘటన పూర్ణియా జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో ఆదివారం జరిగింది. ఆ తర్వాత నిందితులు భయంతో గ్రామం విడిచి పారిపోయారు. దీంతో గ్రామం మొత్తం నిర్మానుష్యంగా మారింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
గ్రామంలో ఇటీవల కొందరు అనారోగ్యంతో మరణించారు. దీనికి బాబులాల్ ఓరాన్ కుటుంబం చేస్తున్న క్షుద్రపూజలే కారణమని గ్రామస్థులు అనుమానించారు. ఈ అనుమానం పెరిగిపోవడంతో ఆదివారం ఒక్కసారిగా ఆ కుటుంబంపై దాడికి దిగారు. బాబులాల్ ఓరాన్, సీతా దేవి, మంజీత్ ఓరాన్, రానియా దేవి, తప్తో మోస్మత్లను కర్రలతో కొట్టి చంపి, ఆ తర్వాత వారి మృతదేహాలకు నిప్పంటించారు.
ఈ దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సమీపంలోని చెరువు నుంచి దగ్ధమైన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘోర దాడి నుంచి ఆ కుటుంబానికి చెందిన ఓ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. గ్రామస్థులందరూ కలిసి తన కుటుంబ సభ్యులను చంపారని ఆ బాలుడు పోలీసులకు తెలిపాడు.
అయితే, బాలుడు తీవ్ర భయాందోళనలో ఉండటంతో పోలీసులు ఇంకా పూర్తి వివరాలు సేకరించలేదని, అందుకే ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయలేదని తెలిసింది. జనాలను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై నకుల్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యల వెనుక మంత్రతంత్రాలు, క్షుద్రపూజలే కారణమని పూర్ణియా ఎస్పీ స్వీటీ సెహ్రావత్ ధృవీకరించారు. ప్రస్తుతం గ్రామంలో డాగ్ స్క్వాడ్తో పోలీసులు గస్తీ కాస్తున్నారు.