అనుమానం పెనుభూతమైంది.. భార్యను హత్య చేసి.. తానూ తనువు చాలించిన భర్త

బుధవారం, 18 అక్టోబరు 2023 (09:12 IST)
అనుమానం పెనుభూతమైంది. దీంతో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నాగోలు సరూర్ నగర్ ఠాణా పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లికి చెందిన తెలగమళ్ల రాజు(45) వివాహం, కడ్తాల్ సమీపంలోని ముచ్చర్లకు చెందిన సంతోష(40)తో 18 ఏళ్ల కిందట జరిగింది. బతుకుదెరువు కోసం ఎనిమిదేళ్ల క్రితం ఈ దంపతులు హైదరాబాద్ నగరానికి వచ్చారు. వీరికి ఇంటర్ చదువుతున్న కుమార్తె, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. 
 
వీరంతా కలిసి నాగోలు సమీపంలోని సాయినగరులో ఓ అద్దె ఇంటిలో ఉంటున్నారు. నగరానికి వచ్చిన కొత్తల్లో స్కూలు బస్సు డ్రైవర్‌గా పని చేసిన రాజు.. ప్రస్తుతం లారీ డ్రైవర్‌గా ఉంటున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని ఆమెను వేధించసాగాడు. దీనిపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. 
 
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కర్మనాఘాట్‌లో ఉండే రాజు సోదరి ఇంటికి భోజనానికి వెళ్లారు. రాత్రి 11 గంటలకు పిల్లలను అక్కడే ఉంచి ఇంటికి వచ్చారు. మద్యం మత్తులో భార్యతో గొడవ జరిగింది. ఈ క్రమంలో కూరగాయలు కోసే కత్తిపీటతో ఆమె గొంతు కోశాడు. రోకలిబండతో తలపై మోది హత్య చేశాడు. 
 
అనంతరం ఇంటికి తాళం వేసి కర్మన్ ఘాట్‌లోని సోదరి ఇంటికెళ్లాడు. అక్కడి రెండంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సరూర్ నగర్ పోలీసులు రాజు మృతదేహాన్ని, నాగోలు పోలీసులు సంతోష మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు