ఫ్రిడ్జిలో శవం, అందుకే పెట్టానని చెపుతున్న యువకుడు

గురువారం, 12 ఆగస్టు 2021 (17:48 IST)
వరంగల్ జిల్లా పరకాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ వృద్ధుడు శవాన్ని ఫ్రిడ్జిలో పెట్టాడు అతడి మనవడు. ఆ వృద్ధుడిని హత్య చేసి పెట్టాడా లేక చనిపోయిన తర్వాత పెట్టాడా అన్నది తేలాల్సి వుంది.
 
వివరాలు చూస్తే... కామారెడ్డి జిల్లాకు చెందిన 90 ఏళ్ల బాలయ్య రిటైర్డ్ లెక్చరర్. ఈయన భార్య, కుమారుడు, కోడలు అంతా పలు కారణాల వల్ల చనిపోయారు. దీనితో 25 ఏళ్ల తన మనవడితో వుంటున్నాడు. ఇంట్లో 3 నెలల క్రితమే బాలయ్య భార్య కరోనాతో కన్నుమూసింది. ఇక అప్పట్నుంచి బాలయ్య దిగులు చెందుతూ వున్నాడు.
 
కొడుకు, కోడలు, భార్య అంతా చనిపోయారు, ఒక్కగానొక్క మనవడి బాగోగులు ఎవరు చూసుకుంటారా అని ఆవేదన చెందేవాడు. ఐతే ఉన్నట్లుండి 15 రోజులుగా బాలయ్య కనిపించడంలేదు. తాత ఏమయ్యాడని మనవడు నిఖిల్ ను అడిగితే... పొంతన లేని సమాధానాలు చెప్పాడు.
 
ఇంతలో వారు నివాసం వుంటున్న ఇంటి నుంచి భరించలేని దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగువారు విషయాన్ని ఇంటి యజమానికి చేరవేసారు. అతడు వచ్చి చూడగా ఫ్రిడ్జ్ నుంచి భరించలేని దుర్వాసన వస్తున్నట్లు గమనించి దాని తలుపులు తీయగా అందులో కుళ్లిపోయిన స్థితిలో వృద్ధుడి శవం కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసి అంతా షాక్ తిన్నారు.
 
తన తాతయ్య చనిపోవడంతో తనకు ఎవరూ లేకపోవడం కారణంగా ఏం చేయాలో తెలియక అలా ఆయన శవాన్ని ఫ్రిడ్జిలో పెట్టానంటూ నిఖిల్ చెపుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు