బంధువుల ఇంటికి వెళ్లి వద్దామని నమ్మించి భార్యాపిల్లలిద్దరిని బైకుపై ఎక్కించుకుని ఓ బావి వద్దకు తీసుకెళ్లిన ఓ వ్యక్తి.. ఆ ముగ్గురుని బావిలో తోసేశాడు. ఆ తర్వాత గొంతుకోసుకుని తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన తిరుపతి జిల్లా పాకాల మండలంలో గురువారం చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మద్దినాయనిపల్లె పంచాయతీ పెద్దూరు హరిజన వాడకు చెందిన టి.గిరి (37), హేమంత కుమారి (35) భార్యాభర్తలు. వీరికి తనుశ్రీ (11), తేజశ్రీ (8) కుమార్తెలు. తిరుపతిలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవల స్వగ్రామం వచ్చారు. గురువారం మధ్యాహ్నం బంధువుల ఇంటికి వెళ్లివద్దామంటూ స్కూటరుపై భార్యా పిల్లలను తీసుకుని కొనే బోయిన ఇండ్లు రింగురోడ్డు సమీ పంలో బావి దగ్గరికి తీసుకెళ్లి అందులోకి వారిని తోసేశాడు.
ఆ తర్వాత భార్య చిన్నకుమార్తె మృతదేహాలను గట్టుకు లాగాడు. అంతలో సమీప పొలాల్లో పనిచేసుకుంటున్న కొందరు గమనించడంతో చాకుతో గొంతు కోసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి గిరిని ఆస్పత్రికి తరలించారు. తనుశ్రీ మృతదేహాన్ని అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సాయంతో వెలికి తీశారు. సీఐ సుదర్శన ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.